అది దేశానికి ప్రధానిని అందించిన రాయలసీమలోని ప్రాంతంగా గుర్తింపు పొందింది. అదివారం అర్ధరాత్రి ఆ పట్టణంలో సినిమాను తలపించే సంఘటన చోటు చేసుకొంది. ఓ ఇంటి ముందు పదుల సంఖ్యలో వాహన శ్రేణి ఆగింది. ఆ వాహనాల్లోంచి రౌడీలు దిగారు.
చేతిలో రకరకాల ఆయుధాలు. అన్నిటికి మించి వాళ్లను చూడగానే భయపడేలా ఆకారాలు. చివరికి ఆ బ్యాచ్కు నాయకత్వం వహిస్తున్న రౌడీ నాయకుడికి పోలీస్ అధికారి చేతిలో వీపు విమానం మోత మోగింది. కర్నూలు జిల్లాలో సంచలనం రేకెత్తిస్తున్న ఈ సంఘటన కథాకమామీషూ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆ రౌడీ బ్యాచ్కు ఓ ప్రముఖ మహిళా నేత భర్త నాయకత్వం వహిస్తున్నాడు. సదరు మహిళా నేత కుటుంబం కర్నూలు జిల్లా రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ఇంటికి పెద్ద దిక్కు ఎవరూ లేకపోవడంతో వారేం చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదని సొంత వాళ్ల నుంచే విమర్శలు.
చిన్న వయసులోనే రాష్ట్రస్థాయిలో పెద్ద పదవి అనుభవించిన సదరు మహిళా నాయకురాలికి రాజకీయంగా హజ్బెండ్ స్ట్రోక్ తప్పడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో బంధువులతో పాటు అనుచరులకు కూడా ఆమె "అప్రియం" అయ్యారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీతో పాటు ఆమె కూడా ఘోర పరాజయం పాలై ....ప్రతిపక్షానికే పరిమితమైనా పెత్తనం మాత్రం ఇంకా తమదే సాగాలనే విపరీత ధోరణులు మహిళానేతలో స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు మహిళా నేత భర్త కర్నూలు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ డెయిరీ సంస్థను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించాడు. దీంతో లేడికి లేచిందే పరుగు అన్నట్టు ...సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా కిడ్నాప్ పథక రచన చేశాడు.
దీంతో కర్నూలు జిల్లాలో జగత్ విఖ్యాతి గాంచిన తన బామ్మర్దిని వెంటబెట్టుకుని సదరు "ప్రియ"మైన భర్త ఓ 25-30 మంది రౌడీ బ్యాచ్ను సిద్ధం చేసుకున్నాడు. ఇదే సమయంలో దేశానికి ప్రధానిని అందించిన ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన ఆ పట్టణంలో డెయిరీ డైరెక్టర్లతో చైర్మన్ సోమవారం సమావేశం నిర్వహిస్తున్నారని తెలుసుకున్నాడు. అంతేకాదు, సదరు పట్టణంలో సదరు చైర్మన్ తన కుమారుడి ఇంట్లో కొందరు డైరెక్టర్లతో సహా ఒకరోజు ముందే దిగాడని పసిగట్టాడు.
ఈ నేపథ్యంలో చైర్మన్ సహా కొందరు డైరెక్టర్లను కిడ్నాప్ చేసి బలవంతంగా తన బామ్మర్దిని ఆ డెయిరీలో కీలకమైన పదవికి ఎన్నుకునే ఎత్తుగడకు కుట్ర పన్నాడు. ఇందులో భాగంగానే పట్టణంలోని ఆ ఇంటికి అర్ధరాత్రి సినీ ఫక్కీలో రౌడీ బ్యాచ్ వెళ్లడానికి ప్రధాన కారణం. వేళ కాని వేళలో రౌడీలను వెంట బెట్టుకుని దిగిన సదరు మహిళా నేత భర్త, అతని బామ్మర్దిని చూడగానే చైర్మన్తో పాటు డైరెక్టర్లు భయాందోళనకు గురయ్యారు.
తమను కిడ్నాప్ చేసేందుకు వచ్చారని నిర్ధారించుకున్న తర్వాత ఓ డైరెక్టర్ అప్రమత్తమై పోలీస్ అధికారికి ఫోన్లో సమాచారం అందజేశాడని తెలిసింది. హుటాహుటీన సదరు పోలీస్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకున్నాడని సమాచాం.
ఇదేం పద్ధతి అని నిలదీసిన పాపానికి సదరు మహిళా నేత భర్త ... ఆ పోలీస్ అధికారిపై బూతుల వర్షం కురిపించాడని తెలుస్తోంది. ఆ పోలీస్ అధికారి రెండో ఆలోచనే లేకుండా ఆ మహిళా నేత భర్తను కిందపడేసి కాళ్లూ చేతులకూ పనిచెప్పాడని కర్నూలు జిల్లాలో కథకథలుగా చెప్పుకుంటున్నారు.
తాను ప్రముఖ మహిళా నేత భర్తనని, అలాగే తాను తమ్ముడినని బావాబామ్మర్దులు బెదిరించే ప్రయత్నం చేసినా ... ఆ పోలీస్ అధికారి మాత్రం పట్టించుకోలేదని సమాచారం. దీనిపై ఫిర్యాదు చేసేందుకు చైర్మన్, డైరెక్టర్లు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. సదరు చైర్మన్ , ఆ మహిళా నేతకు దగ్గరి బంధువు కావడమే అసలు కారణమని తెలుస్తోంది.
తరచూ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంటున్న సదరు మహిళా నేత భర్త వ్యవహార శైలితో ఆమెకు చిక్కులు తప్పడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఓ ప్రతిపక్ష మహిళా నేత భర్త, ఆమె తమ్ముడు ఏ ధైర్యం చూసుకుని కిడ్నాప్నకు తెగబడ్డారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంత జరిగినా పోలీసులు కేసు పెట్టకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలొస్తున్నాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు