మాజీ మంత్రి, తెలుగుదేశం నేత భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తిదాయకమైన చర్చ నెలకొంది. ఇప్పటికే వరసగా బెయిల్ పిటిషన్లు వేస్తూ తిరస్కరణ పొందుతున్నారు అఖిలప్రియ. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కోర్టులో అఖిలప్రియ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆ కోర్టు నుంచి ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు వినిపించినట్టుగా తెలుస్తోంది.
ఈ కేసులో అఖిలప్రియకు బెయిల్ ఇవ్వడం తమ పరిధిలోని అంశం కాదని కోర్టు పేర్కొందట! అదెందుకు.. అంటే, అఖిలప్రియపై నమోదు అయిన సెక్షన్లు, అభియోగాలు తీవ్రమైనవి అని.. వాటిల్లో యావజ్జీవ శిక్ష పడే అవకాశాలున్నాయని.. వాటి విషయంలో తాము బెయిల్ పిటిషన్ పై విచారణ జరపలేమని సికింద్రాబాద్ కోర్టు పేర్కొందట. ఈ కేసులో యావజ్జీవ శిక్ష పడే కారాణాలున్న చేత బెయిల్ కోసం నాంపల్లి కోర్టునే ఆశ్రయించాలని సికింద్రాబాద్ కోర్టు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
దీంతో బెయిల్ విషయంలో అఖిలప్రియకు ఎదురుచూపులు తప్పనట్టుగా ఉన్నాయి. బెయిల్ దక్కకపోవడం సంగతి అలా ఉంచితే.. ఈ కేసులో యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందనే వ్యాఖ్యలే సంచనలంగా ఉన్నాయి. వ్యక్తులను కిడ్నాప్ చేయించారు.. ఆ తర్వాత ఏం చేయాలనుకున్నారు, ఏం చేశారు.. అనేది వేరే సంగతి. చాలా ప్రీ ప్లాన్డ్ గా ఏకంగా 20 మందిని ఉపయోగించి.. పెద్ద కిడ్నాప్ డ్రామాను నడిపించారని పోలీసుల కథనం ద్వారా స్పష్టం అవుతోంది.
ఈ వ్యవహారంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరణ చేయడం, ఇప్పటికే కిడ్నాపింగ్ లో పాల్గొన్న నిందితులను పట్టుకోవడం వంటి కారణాల చేత.. ఈ కేసులో సూత్రధారులు ఇరుక్కున్నట్టుగా ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసు తీవ్రత గట్టిగానే ఉంటుందని కోర్టు నుంచి వినిపించిన వ్యాఖ్యలు స్పష్టతను ఇస్తున్నాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు