Advertisement

Advertisement


Home > Politics - Gossip

'ప్రమాణపూర్తిగా' ఇది సరికాదు

'ప్రమాణపూర్తిగా' ఇది సరికాదు

మీడియా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే. ప్రభుత్వాలను, నాయకులను నిలదీయాల్సిందే. అందులో అణుమాత్రం సందేహం లేదు. కానీ ప్రతిపక్ష నాయకులకు, మీడియాకు మధ్య సన్నని గీత వుంది. ఆ సరిహద్దు అలాగే వుండాలి. ఆ గీత దాటితే మీడియా కూడా రాజకీయ నాయకుల మాదిరిగా మారిపోతుంది. ఆంధ్ర నాట మీడియా సంస్థలు చాలా వరకు ఈ గీతను ఏనాడో దాటేసాయి. 

నాయకులతో వ్యవహారాలను వ్యక్తిగత వైరాలుగా మార్చేసుకున్నాయి. అందువల్ల వండి వార్చే వ్యాసాలు అభిప్రాయాలు, విశ్లేషణలు మాదిరిగా కాకుండా వాద ప్రతివాదాలుగా మారిపోతున్నాయి. కాదు..మారిపోయాయి. వారం వారం ఒక్క తెలుగు రాష్ట్రం పనితీరు మీదే ఎక్కువగా వ్యాసాలు వండి వారుస్తారు ఆంధ్రజ్యోతి ఆర్కే. అయితే ఇటీవల షర్మిల పార్టీ వ్యాసం దగ్గర నుంచి వైఎస్ కుటుంబం నుంచి వస్తున్న ప్రకటనలకు కౌంటర్ల మాదిరిగా తన వ్యాసాల టార్గెట్ ను మళ్లించినట్లు కనిపిస్తోంది. 

తన వ్యాసాలకు కౌంటర్లుగానే వైఎస్ కుటుంబం నుంచి ప్రకటనలు వస్తున్నాయని ఆయన డిసైడ్ అయిపోయి, తన కౌంటర్ తాను సంధిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయమ్మ ఇచ్చిన ప్రకటనకు కౌంటర్ గా ఈవారం కొత్త పలుకు అందించారు.

లేఖలోని అంశాల సంగతి అలా వుంచి అసలు ఆ లేఖ విజయమ్మే రాసారా? అలా అయితే విజయ రాజశేఖర రెడ్డి అని ఎందుకు కింద పేర్కొన్నారు. సంతకం ఎందుకు చేయలేదు లాంటి రంధ్రాన్వేషణకు పూనుకున్నారు. మొత్తం వ్యాసం చూస్తుంటే వైఎస్ కుటుంబంలో విబేధాలు వున్నాయి. మరణించిన వైఎస్ తో సహా మిగిలిన వారు ఎవ్వరికీ జగన్ అంటే సరిపడదు అనే విషయాన్ని బలంగా చెప్పాలనుకోవడం వేరు. నిరూపించాలనుకోవడం వేరు. ఛాలెంజ్ చేయడం వేరు.

మీడియా పని వెల్లడి చేయడం వరకే. సవాళ్లు ప్రతి సవాళ్లు కాదు. వెల్లడించడం, కాదు అని ఎవరైనా అంటే దానికి మద్దతు అంశాలను వెలుగులోకి తీసుకురావడం అన్న వరకు ఓకె. కానీ అలా మద్దుతు అంశాలు లేనపుడు సైలంట్ గా ఊరుకోవాలి. అలా కాకుండా బైబిల్ మీద ఒట్టేసి చెప్పండి. భగవద్గీత మీద ఒట్టేసి చెప్పండి అని రాజకీయ నాయకుల మాదిరిగా సవాలు చేయడం ఏమిటో? ఇంకా నయం కాణిపాకం వచ్చి సత్యప్రమాణమో, వాటికన్ కు వెళ్లి మరో తరహా నిరూపణో చేయమని అడగలేదు.

రాజకీయ నాయకులు ఇలాంటి సవాళ్లు విసురుతారు. మీడియా కాదు. దమ్ముంటే ఇక్కడకు రా..చాతనైతే ప్రమాణం చేసి చెప్పు ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ మీడియా ఇలాంటి సవాళ్లు ఎప్పుడూ విసరకూడదు. ఓ విషయం తెలిసింది అని ఎవరైనా రాసుకోవచ్చు. అవతలి వారు ఖండించుకోవచ్చు. కానీ మీడియా వుంటే సాక్ష్యాలతో బయటపెట్టాలి. లేదంటే నిజం వెల్లడయ్యే వరకు వేచి వుండాలి. అంతే కానీ ప్రమాణాలు చేయండి అని సవాళ్లు విసరడం అంటే ఏమనుకోవాలి.

రేపు అట్నుంచి కూడా అలాంటి సవాళ్లు వస్తే..గ్యాసిప్ లు సవాలక్ష ఏకరవు పెడితే, మీకు టాప్ ఇన్ ఫా కంపెనీల నుంచి నెల నెలా డబ్బులు అందేవంట కదా? మీకు ఫలానా స్వామీజీకి డబ్బు బంధాలు వున్నాయంట కదా? ఇలా ఎవరికి తోచిన ఆరోపణలు వారు చేసేసి, దమ్ముంటే సత్యప్రమాణం చేయండి..గుళ్లో దీపం ఆర్పండి లాంటి సవాళ్లు విసిరితే ఎంత అసహ్యంగా వుంటుంది? ఇదీ అలాగే వుంది.

మీడియాకు ఓ బాధ్యత వుంది. దానికి ఓ ప్రాసెస్ వుంది.ఆ పద్దతిలోనే అది నడవాలి తప్ప, గీత దాటి రాజకీయాల్లోకి దిగిపోకూడదు. దాని వల్ల వున్న విలువలు ఏమైనా వుంటే అవీ దిగజారిపోతాయి.

ఇక ఇదే వ్యాసంలో ప్రస్తావించిన వైఎన్ పై దాడి, వివేకా హత్య, ఇలాంటి విషయాలు, వాటి దర్యాప్తుల నత్త నడక గురించి వేరే వ్యాసంలో డిస్కస్ చేద్దాం.

ఆర్వీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?