తమ మాజీ మంత్రి అరెస్టైతే.. కిక్కురుమనలేని పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్! ఒకవైపు అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతూ ఉందని వీరు తరచూ ఆరోపిస్తూ ఉంటారు.
ఊళ్లలో జరిగిన గొడవలకు కూడా కుల, మత రచ్చలు రేపి రాజకీయం చేయడమే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ లు పెట్టుకున్న పని. తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ, నేతలను అరెస్టు చేస్తూ ఉన్నారంటూ విరుచుకుపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక మాజీ మంత్రి అరెస్టు అయితే కిక్కురుమనడం లేదు చంద్రబాబు నాయుడు, లోకేష్.
ఇప్పటికే ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తావించింది. అఖిలప్రియ అరెస్టుపై చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదంటూ ఆ పార్టీ ప్రశ్నించింది. అయితే తమకు రాజకీయం చేయడానికి అనువైన అంశాల గురించినే స్పందించడం తప్ప.. ఆ అవకాశం లేని అంశాలు తమకు తెలియనట్టుగా వ్యవహరించడమే తమ నైజమని చంద్రబాబు నాయుడు చాటుకుంటూ ఉన్నారు.
అరెస్టు అయిన తమ పార్టీ నేతల కుటుంబాలను పరామర్శించడం కూడా చంద్రబాబు తనయుడు లోకేష్ చేస్తున్న రాజకీయం. అయితే ఇప్పుడు భూమా కుటుంబాన్ని ఇంకా పరామర్శించే ధైర్యం కూడా చేస్తున్నట్టుగా లేరు.
ఇదే తరహా అరెస్టు ఏపీలో జరిగి ఉంటే.. తెలుగుదేశం ఆ విషయంలో ఎంత రాజకీయం చేసేదో.. ఎన్ని హాహాకారాలు పెట్టేదో... తల్లిదండ్రి లేని పిల్లలను వేధిస్తున్నారంటూ ఎంత సానుభూతిని పొందే ప్రయత్నం చేసేదో.. ఈ పాటికి పచ్చమీడియా ఎన్ని కన్నీళ్లను పెట్టే ఎపిసోడ్లను అల్లేదో వేరే చెప్పనక్కర్లేదు.
ఇక భూమా జగత్ విఖ్యాత్యుడు మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ తమను వేధిస్తున్నాయంటూ చెప్పుకున్నారు. ఈ మాటను వినే ప్రజలు ఎలా నవ్వుతారో ఆయనకు తెలియదు కాబోలు. మరి ఇదే మాటను అయినా.. చంద్రబాబు చేత చెప్పించాలి భూమా జగత్ విఖ్యాత్. ఇప్పుడు స్పందించే దమ్మూధైర్యం చంద్రబాబుకు కానీ, లోకేష్ కు కానీ లేదని తేటతెల్లం అవుతోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు