Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఇళ్ల స్థలాల విషయంలో ఇరుకు ఆలోచనలు

ఇళ్ల స్థలాల విషయంలో ఇరుకు ఆలోచనలు

ఇళ్ల స్థలం లేని కుటుంబం ఆంధ్రలో వుండకూడదు అన్నది సిఎమ్ జగన్ ఆలోచన. నిజానికి ఎవరైనా సరే, పార్టీ బంధాలు, అభిమానాలు పక్కన పెట్టి మెచ్చుకోవాల్సిన సంగతి. ఇళ్ల స్థలం కొనడం అన్నది ఎంత మారుమూల పల్లెలో అయినా వేలు ఖర్చు చేయాల్సిన సంగతి. అలాంటిది ఫ్రీగా ఇవ్వడం, అది కూడా ఓ లే అవుట్ మాదిరిగా తయారుచేసి ఇవ్వడం అంటే మెచ్చుకోవాల్సిందే కదా.

ఇక ఇక్కడ ప్రతిపక్షాలు రెండు రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకటి ఇళ్ల స్థలాల కోసం ప్రయివేటు భూములు అధిక ధరలకు కొంటూ, మధ్య దళారులు లాభం చేసుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని. సరే ఆ సంగతి అలా వుంచుదాం. ఎందుకంటే అది గ్రౌండ్ లెవెల్ కు దిగితే తప్ప తేలేదీ కాదు, తెలిసేదీ కాదు. 

రెండో రకం అభ్యంతరం ఏమిటంటే కొండల్లో, ఊరికి దూరంగా, రాళ్లల్లో స్థలాలుచదును చేసి ఇస్తున్నారని. ఓ కోస్తా జిల్లాలో 800 వైట్ రేషన్ కార్డులు వున్న ఓ చిన్న పల్లెటూరిలో 170 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. మనిషికి రెండు సెంట్లు (100 గజాలు) వంతున 340 సెంట్లు అంటే మూడున్నర ఎకరాలు స్థలం కావాలి. ఇంత స్థలం ఊరి నడిబొడ్డున దొరకుతుందా? అయితే కొనాలి. లేదా బంజరు వుంటే అది చదును చేసి ఇవ్వాలి. అంతే కదా? ఊరి చివర బంజరు దగ్గర 170 కుటుంబాలు ఇళ్లు కట్టుకుంటే అది ఎలా వుంటుంది? ఊరుగా మారిపోదా?

సినిమా జనాలకు స్థలాలు ఇచ్చినపుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎలా వున్నాయి? మాకెందుకీ స్థలాలు అని ఆ కొండలను గుట్టలను వదిలేయలేకపోయారా? ఎగబడి మరీ ఎకరాలు ఎకరాలు ఎలా తీసుకున్నారు. ఇప్పుడు అవి ఎంత కోట్ల విలువ?

ఎన్టీఆర్ టైమ్ లో...?

ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక ఓ మంచి పని చేసారు. అవిభక్త ఆంధ్ర రాష్ట్రం అంతా ఆర్టీసీ బస్ స్టేషన్ లు, డిపోలు నిర్మింప చేసారు. కానీ అందుకోసం ఎక్కువ స్థలం కావాల్సి వచ్చింది. ప్రతి చోటా ఊరి శివారులోనే వాటిని నిర్మించారు. జనం అప్పట్లో గోల పెట్టారు. ఊరి చివర బస్ స్టాండ్ నా అంటూ. కానీ ఇవ్వాళ పరిస్థితి ఏమిటి?

విశాఖ ద్వారకానగర్ బస్ట్ స్టేషన్ నిర్మిస్తుంటే అప్పట్లో జనం గోల పెట్టారు. ఊరి చివర బస్ట్ స్టేషన్ కడుతున్నారు. వన్ టౌన్ లో వున్న బస్ స్టేషన్ నే వుంచాలి అంటూ అప్పట్లో గట్టిగానే ఆందోళనలు జరిగాయి. ఇదే విధంగా చాలా పట్టణాల్లో జరిగాయి. ఇప్పుడు ఆయా పట్టణాల్లో కావచ్చు, విశాఖ ద్వారకానగర్ లో కావచ్చు, పరస్థితి ఏమిటి?  అంగుళం జాగా దొరకదు కొనాలన్నా.

ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రదేశాలు కూడా ఓ అయిదేళ్లు దాటితే అలాగే మారుతాయి. అందులో సందేహం లేదు. అభివృద్ది అనేది వికేంద్రీకరణ వల్లే సాధ్యం అవుతుందని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలుసుకుంటుందో? రాజధాని విషయంలోనూ ఇదే వాదన. ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలోనూ ఇదే వాదన. 

నేషనల్ హైవేలు అభివృద్ది చేసినపుడు బైపాస్ రోడ్ లు ప్రతి ఊరికి దూరంగా వేసారు. కానీ ఇప్పుడు చూస్తే ప్రతి ఊరి బైపాస్ మరో కొత్త ఊరుగా మారిపోయిన వైనం కనిపిస్తుంది.

పల్లెల్లో ఊరికి ఊరికి మధ్యన శివారులు వుంటాయి. ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా రెండు ఊళ్లను కలిపే అవకాశం కలుగుతుంది. అలా కూడా కుదరలేదు అనుకుందాం. వందలాది మందికి ఒకే చోట, ఎక్కడో అక్కడ ఇవ్వడం ద్వారా అక్కడ కొత్త ప్రాంతాలు అభివృద్ది చెందడానికి దారి వేసినట్లు అవుతుంది. అంతే కాదు లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో సిమెంట్, ఇటుక, ఇనుము లాంటి బిల్డింగ్ మెటీరియల్ గిరాకీ ఎంత పెరుగుతుంది. ఏ మేరకు అమ్మకాలు పెరుగుతాయి. ఏమేరకు జిఎస్టీ పెరుగుతుంది. ఏ మేరకు జనాలకు పనులు దొరుకుతాయి. ఇవన్నీ ఆలోచించాలి కదా?

కేవలం ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని అడ్డం పడితే, ముందుగా తెలుగుదేశం పార్టీకి వున్న పరువు, పేరు పోయే ప్రమాదం వుంది.

చచ్చిపోతానేమో అని చాలా భయమేసింది

అమరావతిపై కుండబద్దలు కొట్టిన జివిఎల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?