ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో నేడు బస చేసే జగన్ మోహన్ రెడ్డి, రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కాబోతున్నారు. జగన్ వెంట పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలున్నారు.
ఇక జగన్ ఢిల్లీ టూర్ వెనుక మర్మం ఏమిటనే అంశం గురించి రకరకాల ఊహాగానాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో ప్రధానమైనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయేలోకి చేరబోతోంది అనేది.
మూడు కేంద్రమంత్రి పదవులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరబోతోంది.. ఆ చర్చలే సాగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆ ప్రచారాన్ని కొట్టిపడేస్తున్నారు. ఎన్డీయే లోకి చేరడం గురించి తమకు ఎలాంటి ప్రతిపాదన లేదని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తూ ఉండటం విశేషం.
ఇదే సమయంలో.. మరో రకమైన ఊహాగానాలూ తీవ్రం అవుతున్నాయి. అమరావతి, ఇతర స్కామ్ లకు సంబంధించి పూర్తి ఆధారాల ఫైల్ తో ఇదివరకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారు. అప్పుడు అమిత్ షాతో వరసగా రెండు రోజుల పాటు జగన్ సమావేశం అయ్యారు. ఆ సమావేశాలకు టీడీపీ వర్గాలు ఏ భాష్యం చెప్పినా.. అసలు సంగతి వేరే అని స్పష్టం అవుతోంది.
చంద్రబాబు నాయుడు స్కామ్ లు, ఆయనను అరెస్టు చేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ జగన్ కేంద్ర హోం శాఖా మంత్రికి విశదీకరించారని, ఈ స్కామ్ ల లిస్టుతో అవాక్కయిన అమిత్ షా , ఈ అంశం గురించి ప్రధానికి కూడా ఒకసారి వివరించాలని జగన్ కు చెప్పినట్టుగా కూడా సమాచారం వస్తోంది.
అసలే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో వేసిన వేషాలతో మోడీకి ఏ రేంజ్ లో హీటెక్కి ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఆఖరి వరకూ తమతో ఉండి.. చివర్లో ప్లేటు ఫిరాయించి చంద్రబాబు నాయుడు తన మార్కు రాజకీయాన్ని చేశారు.
అన్నింటికీ మించి ఏపీలో అవినీతి సొమ్మును కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు సర్ధినట్టుగా కూడా చంద్రబాబుకు ఖ్యాతి దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా ఆయనను పట్టించుకోవడం లేదని స్పష్టం అవుతూ ఉంది.
ఈ క్రమంలో రానున్న హాట్ పొలిటికల్ పరిణామాలకు మోడీతో జగన్ సమావేశం నాంది పలుకుతుందని, చంద్రబాబు నాయుడు-లోకేష్ ల అరెస్టుకు ఇది తొలి మెట్టు అవుతుందనే ప్రచారమూ సాగుతూ ఉంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు