ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అంటే...ఔననే సమాధానం వైసీపీ వర్గాల నుంచి వస్తోంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని ఇటీవల చంద్రబాబునాయుడు రాజకీయ కోణంలో అన్నారు. అయితే ఆయన మాటల్లో నిజం లేకపోలేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై సాగుతున్న ప్రచారానికి బలం కలిగింది. ఇటీవల జగన్ ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అప్పుడు తన తమ్ముడు వైఎస్ అవినాష్రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు కేంద్ర పెద్దల ప్రసన్నం కోసం వెళ్లారనే ప్రచారం జరిగింది. అయితే ప్రత్యర్థుల ఆరోపణల్లో నిజం లేదు.
ఒకట్రెండు ముఖ్యమైన పనులపై ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఒక రాజ్యాంగ వ్యవస్థలోని వ్యక్తి అతి ఎక్కువ కావడంతో, అతన్ని సాగనంపేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు సత్ఫలితం ఇచ్చింది. అలాగే పోలవరానికి సంబంధించి నిధుల కోసం వెళ్లారు. అది కూడా కొంత వరకూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలిసింది.
ఇదిలా వుండగా బుధవారం మరోసారి జగన్ వెళ్లనుండడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రత్యర్థుల దృష్టి అంతా జగన్ పర్యటనపై ఉంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే జగన్ ఢిల్లీ వెళుతుండడం, ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలవాలని నిర్ణయించుకోవడం వెనుక కారణాలు ఏవై ఉంటాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వైఎస్ జగన్ నిర్ణయాలు ఒక్కో సారి షాక్కు గురి చేస్తుంటాయి. తన మనసులో ఏముందో ఎవరికీ అంతుచిక్కనివ్వరు. జగన్ చర్యలు మాత్రమే మాట్లాడుతూ వుంటాయి.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జగన్ లైట్ తీసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ, అది నిజం కాదనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలో నిరసన గళాలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే, ప్రత్యర్థులకు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా చావుదెబ్బ తీయాలనే వ్యూహంతో జగన్ ముందస్తు ఆలోచన చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే వుంది. ఈ గడువు ప్రకారం ఎన్నికలకు వెళితే... టీడీపీ, జనసేన చక్కగా పొత్తులు కుదుర్చుకుని, తమపై ఎదురు దాడికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటాయని జగన్ లెక్కలేసుకుంటున్నారు. తన ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న మాట నిజమేనని, అయితే ఆ రెండు పార్టీలు కలవనీయకుండా ఎన్నికలకు వెళితే, మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం సులువని జగన్ ఆలోచన.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు