టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యాక్టీవ్ అయ్యారు. క్షేత్రస్థాయిలో లోకేశ్ పర్యటిస్తుండడంతో పార్టీ శ్రేణులకే ఆశ్చర్యం కలుగుతోంది. కరోనా దెబ్బతో చంద్రబాబు పూర్తిగా స్వీయ గృహ నిర్బంధంలో ఉండడంతో , పార్టీ నాయకులు, శ్రేణులు విమర్శిస్తున్న నేపథ్యంలో కుమారుడిని పంపాల్సి వచ్చింది.
తుపాను దెబ్బకు కోస్తాలో పంటలు దెబ్బతిన్నాయి. వరద బాధితులను పరామర్శించడానికి లోకేశ్ చక్కర్లు కొడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ రూరల్ నియోజక వర్గాల్లో సోమవారం పర్యటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే రైతుల తరపున పోరాటం చేస్తానని హెచ్చరించారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల ఫలితంగానే బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించాల్సి వస్తోందన్నది అందరికీ తెలిసిందే. వ్యవ సాయ బిల్లులకు ఇటు లోక్సభలో, అటు రాజ్యసభలో వైసీపీతో పాటు టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి.
నిజంగా రైతులపై ప్రేమే ఉంటే ఆ బిల్లులకు మద్దతు తెలపకుండా కేసీఆర్ మాదిరిగా చంద్రబాబు ఎందుకు వ్యవహరించలేదనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
చట్ట సభల్లో మాత్రం కేంద్రానికి వత్తాసు పలుకుతూ క్షేత్రస్థాయిలో మాత్రం జగన్ సర్కార్పై రైతుల్లో వ్యతిరేకత తెచ్చి రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే కుతంత్రాన్ని లోకేశ్ విమర్శలు ప్రతిబింబిస్తున్నాయి. మోడీ -అమిత్షా పేర్లు చెబితే చాలు గజగజ వణికిపోయే చంద్రబాబు నోట ...ఇదే మాటను లోకేశ్ పలికించే దమ్ముందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
చిత్తశుద్ధి లేని మాటలెందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులకు నష్టం కలిగించే బిల్లులను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి అకాలీదల్ బయటికొచ్చిన విషయం తెలిసిందే.
ఎన్డీఏతో ఏ మాత్రం సంబంధం లేని టీడీపీ ఆ బిల్లులకు మద్దతు ఇచ్చి, ఇప్పుడు తగదునమ్మా అంటూ రైతుల తరపున ఉద్యమిస్తామని లోకేశ్ చేస్తున్న హెచ్చరికలు అతని రాజకీయ అజ్ఞానానికి, అపరిపక్వతకు నిదర్శనమే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు