మోడీ సర్కార్ అణచివేత విధానాలు దేశంలో చాలా రాజకీయ పార్టీలకు నచ్చకపోయినా ...ధైర్యం చేసి విమర్శించే పరిస్థితి లేదు. మోడీ సర్కార్పై ఎదురు దాడి చేస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ మినహాయిస్తే , ప్రాంతీయ పార్టీలు వేళ్ల మీద లెక్కపెట్టేవన్నీ కూడా లేవని చెప్పొచ్చు.
ఢిల్లీ వేదికగా సంచలనం సృష్టించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ మొదట్లో బీజేపీ అంటే ఒంటికాలిపై లేచేవారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, ముందున్నంత వాడివేడి ఆయన మాటల్లో కనిపించడం లేదు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మోడీ సర్కార్పై విమర్శలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇక మమతా బెనర్జీ గురించి చెప్పాల్సిన పనేలేదు.
కనీసం మమతా లాంటి నేతలు కూడా లేకపోతే ఈ దేశంలో బీజేపీని ఎదురించగల మరే నాయకులు కనిపించరేమో. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మన చంద్రబాబునాయుడు హంగామా చేశారు.
అబ్బో మోడీని ధిక్కరించే పాలెగాడు దొరికాడని దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నేతలు నమ్మారు. తీరా ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆ ప్రాంతీయ పార్టీల నేతల ఫోన్కాల్స్ను కూడా అటెండ్ చేయలేని దుస్థితిలోకి బాబు వెళ్లారు.
ఈ నేపథ్యంలో మోడీ సర్కార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్ విసిరారు. బీజేపీ దిమ్మ తిరిగేలా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒక నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘కేటీఆర్ గారూ ఇటీవల మీరు భారత్ బయోటెక్ను సందర్శించినప్పుడు కరోనా టీకా అయిన ‘కోవాక్సీన్’వేసుకున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇంతగా జనంలో తిరుగుతున్నా మీకు ఏమీ కాలేదు. లేదా ఇంకేదైనా కారణం ఉందా’అని ట్విట్టర్లో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు.
కేటీఆర్ సమాధానం ఇస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. నేను కోవాక్సీన్ టీకా వేసుకోలేదు. అది బిహార్ కోసమే రిజర్వ్ చేశారట’అని బీజేపీ చెంప ఛెళ్లుమనేలా కేటీఆర్ సమాధానం ఇచ్చారు. బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో కరోనా టీకా ఉచితంగా పంపిణీ చేస్తామని బీజేపీ ప్రస్తావించిన నేపథ్యంలో కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించడాన్ని నెటిజన్లు పసిగట్టారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో బిహార్లో ఎన్డీయే ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు. కరోనా టీకా ఉచితంగా పంపిణీ చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. ఐసీఎంఆర్ వ్యాక్సిన్కి అనుమతినివ్వగానే ప్రజలకు ఉచితంగా అందిస్తామని ఆమె చెప్పుకొచ్చారు.
ఎన్నికలు వస్తే తప్ప ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వరా? అని కేంద్రాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తారు. చివరికి కరోనాను కూడా బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే కేటీఆర్ ట్వీట్ను చూడాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు