ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతిపక్షాలు అడుగడుగునా ఏదో రకంగా అడ్డుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ పాలనా పరమైన అంశాల్లో ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించ వచ్చో, అన్ని రకాలుగా ఈ 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. హైకోర్టులో వ్యాజ్యాలు, తీర్పులు, ఆదేశాలు... ఇతరత్రా అంశాల్ని గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ సమాజం నిర్వేదం, నిరాశ, ఆక్రోశంతో ...ఇక జగనే పాలనకు అనర్హుడని ఓ వ్యాజ్యం వేస్తే సరిపోతుంది కదా! అని అభిప్రాయపడడాన్ని చూస్తున్నాం.
సరిగ్గా ఆ అభిప్రాయాన్ని కూడా నిజం చేస్తూ ...తాజాగా హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఇంత వరకూ జగన్ సర్కార్పై దాఖలైన వ్యాజ్యాల్లో ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్తో పాటు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని తదితరులను తమ పదవులు, పోస్టులు నిర్వహించకుండా నిలువరించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో కోవారెంటో పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడం దేవాదాయ చట్టంలోని సెక్షన్ 97, 153లకు విరుద్ధమని పిటిషన్ పేర్కొన్నాడు. డిక్లరేషన్ అవసరం లేదని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని అన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా జగన్, మంత్రులుగా వెల్లంపల్లి, నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అశోక్సింఘాల్ ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు.
అంతేకాదు వాళ్లను ఆ పదవులు, పోస్టులు నిర్వహించకుండా నిలువరించాలని హైకోర్టును పిటిషనర్ అభ్యర్థించడం గమనార్హం. అంతే లేండి, పనిలో పనిగా అసలు ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఎలా పట్టం కట్టారో ప్రజల్ని కూడా వివరణ అడగాలని, ఆ తప్పు చేసినందుకు ప్రజలకు కఠిన శిక్ష విధించాలని మరో వ్యాజ్యం వేస్తే సరిపోతుంది. అంతేగా అంతేగా...
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు