సహజంగా హేళన పట్టించడానికి జోకర్ అని కామెంట్ చేస్తుంటారు. కానీ జోకర్కు ఉన్న ప్రాధాన్యత దేనికీ ఉండదు. పేకాటలో జోకర్ పడితే ఆట అవుతుందంటారు. అలాగే సినిమాలు, డ్రామాలు, సర్కస్లలో జోకర్ కనిపిస్తే చాలు...ఒకటే ఈలలు. చెవులు చిల్లులు పడుతాయేమో అన్నంతగా పిల్లలు, పెద్దలు చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ పగలబడి నవ్వుతూ ఉంటారు. ఆరోగ్యం కోసం లాఫింగ్ క్లబ్లు నడుపుతున్న వారు లేకపోలేదు.
రాజకీయాల్లోకి వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డికి నవ్వు ఒక ఆభరణం. అసెంబ్లీలో వైఎస్సార్ నవ్వుతుండటాన్ని అప్పటి ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు తప్పు పట్టారు. దానికి వైఎస్సార్ స్పందిస్తూ...నవ్వడం ఒక యోగమని, నవ్వకపోవడం ఒక రోగమని దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.
బాబు ముఖంలో ఏనాడూ నవ్వు చూసిన దాఖలాలు లేవు. కానీ ఆయన కడుపున పుట్టిన లోకేశ్బాబుకు కూడా నవ్వే అలవాటు లేదు. కానీ చంద్రబాబులో లేనిది, లోకేశ్లో ఉన్న సుగుణం ఏంటంటే...అందరినీ నవ్వించడం. లోకేశ్ భలే చిలిపి.
తన సామ్రాజ్యమైన ట్విటర్ వేదికగా లోకేశ్ గమ్మత్తైన ట్వీట్స్ ఇస్తూ ప్రజల్ని నవ్విస్తూ ఉంటాడు. లోకేశ్ కొవ్వొత్తి లాంటివాడు. ఎలాగైతే కొవ్వొత్తి తాను కరిగిపోతూ లోకానికి వెలుగునిస్తుందో...లోకేశ్ కూడా తాను నవ్వుల పాలవుతూ, లోకానికి నవ్వులు పంచుతూ ఆరోగ్యాలను కాపాడుతున్నాడు.
తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ ఉదంతంపై లోకేశ్ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో జగన్ సర్కార్ తీరును తప్పు పట్టాడు. దళితులపై తన ప్రేమ కురిపించాడు.
‘ఒక దళిత వైద్యుడిపై మీ ప్రతాపం చూపిస్తారా.. జగన్! మీ ఇగో హర్ట్ అయ్యిందని డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేయడం దారుణమైన చర్య. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు, సిబ్బందికి మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు ఇ వ్వలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. మాస్కులు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేయడం జగన్ అధికార మదానికి నిదర్శనం. ఎన్నికలే ముఖ్యం అని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన మీకు ఏం శిక్ష వేయాలి?’ అని నిలదీశాడు.
వర్ల రామయ్యకు రాజ్యసభ ఇస్తున్నట్టు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించి, చివరికి హ్యాండ్ ఇచ్చిన ఘనత తన తండ్రిదని లోకేశ్ మరిచినట్టున్నాడు. అలాగే మంత్రివర్గం నుంచి రావెల కిషోర్బాబుతో పాటు మరో దళిత మంత్రిని తొలగించిన సందర్భంలో లోకేశ్కు దళితులు గుర్తుకు రాలేదు. అంతెందుకు ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తగినంత బలం లేదని తెలిసి కూడా వర్ల రామయ్యను బరిలో నిలిపి దళితులను బకరా చేయడం లోకేశ్కు తెలియకపోవడం విచిత్రంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులన్నీ దారి మళ్లించి, వాళ్ల అభివృద్ధిని అడ్డుకున్నప్పుడు దళితులు గుర్తుకు రాకపోవడం విచిత్రంగా ఉంది.
ఇంకా చెప్పాలంటే దళితుడైన డాక్టర్ సుధాకర్ అమాయకత్వం, అజ్ఞానాన్ని సొమ్ము చేసుకోవడానికి అతనితో ప్రభుత్వంపై విమర్శలు చేయించారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. డాక్టర్ సుధాకర్ సస్పెండ్పై తండ్రి ట్వీట్ చేస్తే దాన్నే కాపీ కొట్టి తన పేరుపై ట్వీట్ చేసిన లోకేశ్ ప్రతిభ తెలిసి నవ్వుకుంటే జనానిదే తప్పు. అంతే తప్ప లోకేశ్ది ఎంత మాత్రం కాదు కాక కాదు. రాజకీయాల్లోకి లోకేశ్గా వచ్చి...అంచెలంచెలుగా జోకేశ్ స్థాయికి చేరుకున్నాడు. ఒకవేళ వర్తమాన రాజకీయాల్లో జోకేశే లేకపోతే...పరిస్థితి ఊహించుకోవడం కష్టమే.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు