పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఈ పర్యటనల్లో ఆయన తన పరిధికి మించి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషనర్గా ఎన్నికల విషయమై ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ నిమ్మగడ్డ ఎన్నికలకు సంబంధం లేని విషయాలపై కామెంట్స్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు రోజుల క్రితం కడప పర్యటనలో, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో నిమ్మగడ్డ మాట్లాడిన తీరు ....రాజ్యాంగ వ్యవస్థ ప్రతినిధిగా కాకుండా రాజకీయ నాయకుడి నైజాన్ని తలపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కడప పర్యటనలో ఆయన అధికారిక సమావేశంలో మాట్లాడుతూ ....
‘సీఎం వైఎస్ వద్ద పని చేయడం నా కెరీర్లో గొప్ప మలుపు. ఆయన నన్ను మూడేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు. అప్పట్లో చాలా మంది అధికారులు ఇబ్బంది పడ్డారు. అయితే ఆర్థిక శాఖ కార్యదర్శిగా కీలకమైన ప్రాజెక్టుల్లో నా సంతకాలు ఉన్నా.. ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఆ తర్వాత వచ్చిన సీబీఐ కేసుల్లో చాలావాటిలో నేను ప్రధాన సాక్షిని.
ఇదివరకే సాక్ష్యం చెప్పాను. మళ్లీ కోర్టులో నిలబడి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. నాకు ఎలాంటి భయం లేదు. ఇలాంటి కేసుల్లో సాక్ష్యం చెప్పేవారికి కోర్టు అనేక రక్షణలు కల్పిస్తుంది. విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది. ధైర్యంగా, నిర్భయంగా నిజం చెబుతాను’ అని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
శ్రీకాకుళం పర్యటనలో ఏమన్నారంటే....
‘ దేశంలో ఎక్కడాలేని విధంగా ఎన్నికల సంఘంపై ఎన్నికల సమయంలో కేసు నమోదుచేశారు. ఎన్నికల సామగ్రిని పట్టుకుపోయారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుంటే రాజ్యాంగ సంస్థల అస్తిత్వానికే ప్రమాదమని భావించి హైకోర్టుకు వెళ్లాం. కోర్టు ఆదేశించినా ఆ సామగ్రి తిరిగి ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించారు.
కడప పర్యటనలో వైఎస్ను పొగుడుతూనే సీబీఐ కేసులు ప్రస్తావనకు తెచ్చారు. అధికారిక సమావేశంలో అసలు ఏ మాత్రం సంబంధం లేని సీబీఐ కేసుల గురించి ప్రస్తావన తేవడం వెనుక నిమ్మగడ్డ నైజం ఎలాంటిదో తెలుసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీబీఐ కేసుల్లో సాక్ష్యం చెప్పాననడం, మున్ముందు కూడా చెబుతాననడం ...ఒక రకంగా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడమే అని అంటున్నారు.
శ్రీకాకుళం పర్యటనలో ప్రభుత్వానికి, తనకు మధ్య గతంలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలను ప్రస్తావించడం ...తేనె తుట్టెను కదపడమే అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకునే సంకేతాలు ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని నిమ్మగడ్డ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే అభిప్రాయాలకు, ఆయన గతం తాలూకూ విషయాలను తవ్వుకోవడం ద్వారా బలం చేకూరుతోందం టున్నారు. ఇప్పటికైనా నిమ్మగడ్డ అధిక ప్రసంగం ఆపి ...రాజ్యాంగ వ్యవస్థ గౌరవాన్ని పెంచేలా ప్రవర్తిస్తే బాగుంటుందనేది మెజార్టీ ప్రజాభిప్రాయం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు