స్వయంప్రకటిత మేధావి మాజీ ఎంపీ సబ్బం హరికి లోకం తీరు ఎలా పోయినా ఫరవాలేదు. ఆయన బాణాలు మాత్రం జగన్ మీద వేయాల్సిందే. తెల్లారిలేస్తే జగన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న సబ్బం వారికి టీడీపీఎలో ఎంత పలుకుబడి పెరిగిందో, బాబు మరెంతగా చేరదీస్తున్నారో తెలియదు కానీ ఆయన మాత్రం తన వాచాలత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.
తాజాగా హరి ఏకంగా జగన్ పాలన మీద ఘాటు విమర్శలు చేస్తూ ఉగాండాతో ఏపీని పోల్చారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేదని హరి బావురుమంటున్నారు. టీడీపీ అనుకూల మీడియాకు ఈ హరి కీర్తనలు చాలా ఇంపుగా, సొంపుగా ఉండడంతో వారు పిలిచి మరీ జగన్ని తిట్టిస్తూంటారు.
పచ్చ మీడియా మైకులు కనిపించగానే పూనకం వచ్చినట్లుగా హరి జగన్ మీద అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపోతున్నారు. ఏపీలో పాలన లేదని అంటున్న హరికి అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అంత బాగా కనిపించిందా అని నిలదీస్తున్నారు.
మొత్తానికి హరికి కరోనా వైరస్ విషయంలో చింత లేదు, ప్రపంచ మహమ్మారి విరుచుకుపడుతున్నా బాధ లేదు. కానీ ఆయన బాధల్లా ఏంటంటే జగన్ సీఎం సీట్లో కూర్చోవడమే. అందుకే పనిగట్టుకుని మరీ మీడియా ముందుకు వచ్చి జగన్ మీద అర్ధం లేని కామెంట్స్ చేస్తున్నారు.
వైఎస్సార్ దయతో ఎంపీగా అయిన హరి ఈ రోజు జగన్ని విమర్శించడం కంటే దారుణం వేరొకటి లేదని వైసీపీ నేతలు అంటున్నారంటే హరి ఇప్పటికైనా మారుతారా. ఏమో టీడీపీ అనుకూల మీడియాను చూస్తే ఆయన నోరు అసలు ఆగదుగా.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు