తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల విషయంలో ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. ఆ ప్రకటనకు కట్టుబడి ఉంటుందా? అనేది రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆ ప్రకటనకు కట్టబడి ఉన్నా.. సదరు అభ్యర్థి నామినేషన్ వేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది.
చంద్రబాబు నాయుడు మార్కు రెండుకళ్ల సిద్ధాంతం తిరుపతి బై పోల్ లో కూడా అనుసరించబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత తన పార్టీ కోసమే పని చేసినా.. అక్కడ ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవు. అలాకాకుండా.. చంద్రబాబు నాయుడు తన రొటీన్ రాజకీయాన్ని చేశారంటే అంతే సంగతులు!
అంటే తన పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపి.. మరొక పార్టీ అభ్యర్థి కోసం లోలోపల సహకారం అందించడం ఇదీ చంద్రబాబు నాయుడి మార్కు రాజకీయం. గతంలో 18 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం క్యాడర్ పూర్తిగా కాంగ్రెస్ కోసం పని చేసింది. అప్పట్లో జగన్ కు పగ్గాలు వేయాలనే లెక్కలతో టీడీపీ డిపాజిట్లను సైతం కోల్పోయి కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లను కట్టబెట్టింది.
అప్పటి లక్ష్యం కేవలం జగన్ ను దెబ్బ కొట్టడం మాత్రమే. కాంగ్రెస్ కానీ, తాము కానీ సొంతంగా గెలిచే అవకాశాలు లేకపోవడంతో టీడీపీ వాళ్లు కాంగ్రెస్ కు మద్దతు పలికారు. ఆ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ పలు చోట్ల డిపాజిట్లు సాధించింది కానీ, టీడీపీ మాత్రం డిపాజిట్లను కూడా కోల్పోయింది. అదీ చంద్రబాబు మార్కు రాజకీయం.
తిరుపతిలో అదే జరగబోతోందని.. బీజేపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థికి చంద్రబాబు నుంచి సహకారం అందబోతోంది, అది చీకటి సహకారమే అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఎవరో మాజీ ఐఏఎస్ ను బీజేపీ బరిలోకి దింపనుందట. ఆయనతో చంద్రబాబుకు మంచి పరిచయాలు కూడా ఉన్నాయట.
ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతు పలికి.. అటు బీజేపీలో మరో తన ఏజెంట్ ఒకరిని తయారు చేసుకోవడంతో పాటు.. ఈ చీకటి సహకారం ద్వారా బీజేపీ మనసు గెలవడానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తున్నాడనే మాట వినిపిస్తోంది.
చంద్రబాబుకు ఎలాగూ ఈ చీకటి రాజకీయాలు కొత్త కాదు కాబట్టి.. వీటిని నమ్మడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. ఈ పరిణామాల్లో తను కోరని టికెట్ ను తనకు కేటాయించి చంద్రబాబు నాయుడు తనదైన రాజకీయంతో ఉన్న పరువు కూడా పోయేలా చేయనున్నారని భావిస్తున్నారట ఇప్పటికే అభ్యర్థిగా ప్రచారం పొందుతున్న పనబాక లక్ష్మి.
తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం పోటీ చేయడమే ఎక్కువ. ఎందుకంటే ప్రతిపక్షంలోకి పడి ఏడాదిన్నర గడుస్తున్నా తెలుగుదేశం అధినేత ప్రజల మధ్యకు వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్కబెట్టతగిన స్థాయిలో ఉన్నాయి. వాటిల్లో కూడా అమరావతి కోసం ఆరాటమే ఎక్కువ. ఏ రకంగానూ ప్రజలతో ప్రతిపక్షంగా కనెక్ట్ కావడం లేదు తెలుగుదేశం పార్టీ.
ఈ నేపథ్యంలో.. టీడీపీ తిరుపతిలో ఏదో సాధించేస్తుందని ఎవ్వరూ అనుకోవడం లేదు. అలాంటి నేపథ్యంలో ఆమెకే చెప్పకుండా పనబాక లక్ష్మికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారనే విషయం క్రమక్రమంగా బయటపడుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ చంద్రబాబు నాయుడు బీజేపీకి చీకటి సహకారం అందించబోతున్నారనే ప్రచారంతో అభ్యర్థి మరింత హడలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే.. నోటిఫికేషన్ వచ్చే సమయానికి టీడీపీ అభ్యర్థి మారినా మారొచ్చు అనే టాక్ మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పనబాక లక్ష్మి ఈ టికెట్ తనకొద్దని కుండబద్ధలు కొడితే మాత్రం.. తెలుగుదేశం పార్టీకి మిగిలి ఉన్న పరువు ఏదైనా ఉంటే అది గల్లంతవుతుంది. ముందుగానే అభ్యర్థిని అనౌన్స్ చేసి.. కొత్త చిక్కులు తెచ్చుకున్నట్టుగా ఉన్నారు తెలుగుదేశం అధినేత అనే విషయం మాత్రం స్పష్టమవుతోందంటున్నారు విశ్లేషకులు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు