Advertisement

Advertisement


Home > Politics - Political News

అప్పటి హత్యాకాండను ఏమనాలి చంద్రబాబూ!

అప్పటి హత్యాకాండను ఏమనాలి చంద్రబాబూ!

రాజకీయ కక్షసాధింపు చర్యల గురించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడులో చేస్తున్న హడావుడి రాయలసీమలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావుడి కొత్తది ఏమీకాదు. అధికారం కోల్పోయిన ప్రతిసారీ చంద్రబాబు నాయుడు ఇలా రోడ్డు ఎక్కుతూ ఉంటారు. తమ పార్టీ వాళ్లపై కక్షసాధింపు చర్యలు అంటూ ఆయన గగ్గోలు పెడుతూ ఉంటారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏ స్థాయిలో రచ్చచేసి ఉంటే.. ఇప్పుడు వారిపై ఏవైనా కక్షసాధింపు చర్యలు ఉంటాయి? అనేది బేసిక్‌ లాజిక్‌.

తెలుగుదేశం పార్టీ వాళ్లు గాంధేయవాదులు అయినట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటారు. నిప్పులేనిదే పొగరాదు, యాక్షన్‌ లేనిదే రియాక్షన్‌ ఉండదు.. ఈ కామన్‌ సెన్స్‌ జనాలకు ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు రాజకీయాలకు మాత్రం అలాంటి సెన్స్‌ ఉండదు. ఇప్పుడు పల్నాడులో జరిగాయని చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతున్న రాజకీయ దాడులు అయితేనేం, గతంలో చంద్రబాబు నాయుడు గగ్గోలుపెట్టిన రాయలసీమ రాజకీయాల విషయంలో అయితేనేం.. వాటిల్లో తెలుగుదేశం పార్టీ పాత్రను తక్కువ చేయడానికి ఏమీలేదు.

గతంలో తొమ్మిదేళ్ల పాటు అధికారాన్ని చేతిలో పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంతంలో ఏం చేసిందో అందరికీ తెలిసిన సంగతులే. ఆ తొమ్మిదేళ్లలో కొన్నివందల మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను హతం అయ్యారు. ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను దారుణంగా హతమార్చారు. ఆ హత్యాకాండ గురించి రాయడం మొదలుపెడితే దానికో హద్దుండదు. తమను వ్యతిరేకించే వారిపై రకరకాల ముద్రలువేసి హత్యలు చేయించింది తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలే అనే అభిప్రాయాలు జనసామాన్యంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆ హత్యాకాండను వ్యతిరేకించింది లేదు.

ఒక్క పరిటాల రవీంద్రే కొన్ని వందల మందిని చంపించారనే పేరు తెచ్చుకున్నారు. ఆయన ఫ్యాక్షన్‌ రాజకీయంపై తీవ్రమైన ఆరోపణలు వినిపించాయి. ఆర్వోసీ పేరుతో, నక్సలిజాన్ని అడ్డం పెట్టుకుని తన రాజకీయ శత్రువులందరినీ పరిటాల రవీంద్ర దారుణంగా చంపించారనే అభిప్రాయాలు గట్టిగా వ్యక్తం అయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు ఆ హత్యాకాండలను తీవ్రంగా నిరసించారు. అయినా అవి ఆగలేదు. చివరకు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాకా పరిటాల రవి హత్యకు గురయ్యారు.

ఆ హత్యకు కారణాలు ఏమిటంటే.. ఆయన అధికారం చేతిలో ఉన్నప్పుడు సాగించిన ఫ్యాక్షన్‌ రాజకీయమే అని పరిశీలకులు తేల్చిచెప్పారు. రాజకీయ విశ్లేషకులు అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రం పరిటాల రవి ప్రముఖ గాంధేయవాది అని ప్రకటించుకున్నారు. పరిటాల రవి హత్య తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక రేంజ్‌లో రెచ్చిపోయింది. ప్రభుత్వ ఆస్తులను తీవ్రంగా ధ్వంసం చేసింది. ఉమ్మడి ఏపీలో కొన్ని వందల బస్సులను తగలబెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పరిటాల రవి ఏదో జాతీయనేత అయినట్టుగా తెలుగుదేశం పార్టీ రియాక్ట్‌ అయ్యింది.

తెలుగుదేశం జాతి అప్పుడు తట్టుకోలేకపోయింది. తమ ప్రతాపాన్ని ప్రజల ఆస్తుల మీద, ప్రభుత్వ ఆస్తుల మీద చూపించింది. అదంతా తెలుగుదేశం పార్టీ మార్కు గాంధేయవాదం! ఇక ఇటీవలి ఐదేళ్లలో కూడా తెలుగుదేశం పార్టీ తీరు ఏమిటో అందరికీ తెలిసిందే. అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరులు కొందరు దారుణహత్యకు గురయ్యారు. పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉండిన రాప్తాడు పరిధిలో ప్రసాద్‌రెడ్డి అనే వైఎస్సార్సీపీ నేతను ప్రభుత్వ కార్యాలయంలోనే దారుణంగా హత్యచేశారు.

అదంతా తెలుగుదేశం పార్టీ మార్కు గాంధేయవాదం. ఇప్పుడు మాత్రం గ్రామాల్లో గొడవలకు రాజకీయ రంగు పులిమి.. వాటిని రాజకీయ కక్షసాధింపు చర్యలు అంటూ చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఈ పరిణామాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని వేరే చెప్పనక్కర్లేదు. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానరాన్నట్టుగా వ్యవహరించడం.. అధికారం కోల్పోయినా ఇలాంటి రాజకీయం చేయడం.. తెలుగుదేశం పార్టీకి దశాబ్ధాలుగా అలవాటు అయిన విద్యలాగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.

మారని తీరు.. అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?