Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ కళ్లకు గంతలు కడుతోందెవరు..?

జగన్ కళ్లకు గంతలు కడుతోందెవరు..?

సీఎం జగన్ కు ఏపీలో పాలన అంతా తెలిసే జరుగుతోందా.. జిల్లాల్లో జరుగుతున్న వింతలు, విశేషాలు అసలాయన వరకు వెళ్తున్నాయా..? ఇది ఆసక్తికరమైన ప్రశ్న. ఇటీవల జగనన్న కాలనీలంటూ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది ప్రభుత్వం. అందులోనే ప్రభుత్వ సాయంతో ఇళ్లు కట్టించి ఇస్తామంది. దీనిలో లబ్ధిదారులు కూడా తమ వాటాకి కొంత సొమ్ము జమ చేయాలి. మిగతాది ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది.

అయితే ఇంటి స్థలమే లేని పేదలు, ఇల్లు కట్టుకోడానికి డబ్బులెక్కడ తెస్తారు. చాలామంది మా దగ్గర డబ్బులేదన్నారు. దీంతో అధికారులు ఓ వెరైటీ ఆలోచన చేశారు. లబ్ధిదారులపై ఒత్తిడి తేవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇల్లు కట్టనివారి వద్ద పట్టాలు వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఈ పద్ధతి అనధికారికంగా మొదలైంది.

ఇల్లు కట్టుకోడానికి స్థలం ఇచ్చాం కానీ, ఇలా ఖాళీగా ఉంచడానికి కాదంటూ ఆ స్థలాలను హౌసింగ్ డిపార్ట్ మెంట్ వాళ్లు వెనక్కి లాగేసుకుంటున్నారు. నేరుగా వాలంటీర్లను పంపించి ఓ ప్రొఫార్మాపై సంతకం పెట్టించుకుని ఇంటి పట్టాలు తీసేసుకుంటున్నారు. "అయ్యా కలెక్టర్ గారూ, మీరు మామీద దయతో ఇంటి స్థలం ఇచ్చారు. కానీ మాకు ఇల్లు కట్టుకునే స్థోమత లేదు, కావున దాన్ని మీకే తిరిగి ఇచ్చేస్తున్నాం." ఇదీ దాని సారాంశం. నిరుపేదలు, పెద్దగా చదువుకోనివారు, ప్రశ్నించే ధైర్యం లేనివారు వాలంటీర్లకు పట్టాలు తిరిగిచ్చేశారు. అయితే దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

అసలిదేం న్యాయం. ఇంటి పట్టాలు తీసుకునే అధికారం హౌసింగ్ డిపార్ట్ మెంట్ వారికి ఎవరు ఇచ్చారు. సీఎం జగన్ పేదలకు పట్టాలిస్తే మధ్యలో హౌసింగ్ డిపార్ట్ మెంట్ లో అధికారులకు ఇబ్బంది ఏంటి..? ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవడంతో జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి ఉంది. త్వరగా గృహప్రవేశాలు జరపాలనే ఉద్దేశంతో వారు హడావిడి పడుతున్నారు. దీంతో కింది స్థాయి ఉద్యోగులు లబ్ధిదారుల్ని బెదిరించి మరీ వారితో అప్పులు చేయించి మరీ ఇంటి నిర్మాణం కోసం డబ్బులు తీసుకుంటున్నారు.

ఈ పద్ధతి కొనసాగడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇంటి స్థలం ఉచితంగా ఇచ్చారు బాగుంది. సబ్సిడీతో ఇల్లు కట్టిస్తామన్నారు అది కూడా బాగుంది. అయితే ఇల్లు కట్టుకోలేనివారి వద్ద పట్టాలు వెనక్కి తీసుకోవడం మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు. అసలీ విషయాలన్నీ జగన్ కి తెలుస్తున్నాయా..? లేదా..? అనేది కూడా అనుమానమే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?