టీడీపీ అధినేత చంద్రబాబును అభినందించాల్సిన సమయం ఇది. ఎందుకంటే తననెవరూ ఏమీ చేయలేరని మరోసారి చట్టబద్ధంగా నిరూపించుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ దాఖలైన పిటిషన్ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది.
చంద్రబాబుపై ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో అసలు పిటిషన్కు విచారణార్హతే లేదని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంద్రబాబుకు ఏదో అవుతుందని ఆశించిన వాళ్లకు నిరాశే మిగిలింది.
కేసు పూర్వా పరాలను తెలుసుకుందాం. ఇది 16 ఏళ్ల క్రితం నాటి కేసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఏసీబీ విచారణకు ఆదేశించాలని 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కేసు విచారణ ప్రారంభం కాకుండానే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే లక్ష్మీపార్వతి ఫిర్యాదును స్వీకరించకనే, వాదనలు ఎలా వింటామని చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు ప్రత్యర్థులు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్పై విచారణ జరిపి ... ఏసీబీ కోర్టులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ 2005లో స్టే విధించారు. అప్పటి నుంచి చంద్రబాబు స్టేపై కొనసాగుతున్నారు. చంద్రబాబును వెటకారంగా స్టేబాబు అని పిలవడం కూడా అందుకే. స్టే ఎత్తి వేయాలని లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్ వేయగా .... హైకోర్టు కొట్టి వేసింది. దీంతో లక్ష్మీపార్వతి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
ఈ నేపథ్యంలో సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించి ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో మరోసారి చంద్రబాబు అవినీతి కేసు తెరపైకి వచ్చింది. ఈ సారి తప్పకుండా చంద్రబాబు తప్పించుకోలేరని ...పాపం కొందరు అమాయకులు ఏవో ఆశలు పెట్టుకున్నారు.
అయితే బాబు అవినీతికి సంబంధించి సరైన ఆధారాలు సమర్పించని కారణంగా , పిటిషన్కు విచారణ అర్హత లేదని ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. లక్ష్మీపార్వతి ఆశకు కూడా హద్దుండాలనే సరదా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు