కరోనాతో అత్యంత తీవ్రంగా బాధింపబడిన దేశాల్లో ఒకటి ఇటలీ. ఊహించని రీతిలో ఆ విపత్తును ఎదుర్కొంది ఇటలీ. చైనా నుంచి డైరెక్టుగా కరోనా వైరస్ ఇటలీకి ట్రావెల్ అయ్యిందని మొదట్లోనే వార్తలు వచ్చాయి. వుహాన్ నుంచి ఇటలీకి తోలు పరిశ్రమ వర్కర్లు, తోళ్లు విపరీతంగా రవాణా అవుతుంటాయని, దీంతో చైనా నుంచి డైరెక్టుగా ఇటలీకి కరోనా వైరస్ ఎక్స్ పోర్ట్ అయ్యిందని నిపుణులు వివరించారు.
ఒకానొక పరిస్థితుల్లో ఇటలీ కరోనా వైరస్ ప్రభావంతో వణికిపోయింది. ఎంతలా అంటే.. అక్కడి మంత్రులే మీడియా ముందుకు వచ్చి బోరుమన్నారు. ఆఖరికి వృద్ధులకు చికిత్స చేయలేమని, వయసులో ఉన్న వారిని రక్షించుకోవడానికే ప్రయత్నాలు అని అక్కడి వైద్యులు ప్రకటించడం వారి పరిస్థితిని అర్థమయ్యేలా చేసింది.
అలాంటి పరిస్థితి నుంచి ఇటలీ నెమ్మదినెమ్మదిగా కోలుకుంటూ వచ్చింది. అక్కడ కరోనా గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతూ ఉంది. దాదాపు రెండు లక్షలా ముప్పై మూడు వేల మంది అక్కడ కరోనా వైరస్ కు గురికాగా, 33 వేల మంది మరణించారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి లక్షా యాభై ఎనిమిది వేలమంది డిశ్చార్జి అయ్యారట. ఇక మిగిలిన వారికి చికిత్స కొనసాగుతూ ఉంది. కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో ఇటలీ వైద్య పరిశోధకులు కరోనా బలహీన పడిందని ప్రకటించడం గమనార్హం.
కరోనా బలహీన పడటం అంటే.. కేసుల సంఖ్య తగ్గడమే కాదు, వైరస్సే బలహీనపడిందని వారు అంటున్నారు. వైరస్ కు మనిషిని చంపే శక్తి బాగా తగ్గిపోయిందని వారు చెబుతున్నారు. రెండు నెలల కిందటి నాటి వైరస్ స్థితికి ఇప్పుడు దాని స్థితికి తేడా ఉందని వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ మార్పు వల్ల కరోనా వైరస్ వల్ల మనిషికి ముప్పు తగ్గిందని వారు చెబుతున్నారు. ఏతావాతా కరోనా వైరస్ దుష్ట శక్తి బాగా తగ్గిందని ఇటాలియన్ పరిశోధకులు చెబుతున్నారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉందో, ఇటలీలోనే అలాంటి పరిస్థితి ఉందో పరిశోధకులు తేల్చాల్సి ఉంది.
అయితే కరోనా ప్రభావం ఒక్కో దేశం-ఒక్కో ఖండంలో ఒక్కోలా ఉండటాన్ని మాత్రం గమనించవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి తీరు, వైరస్ వల్ల నమోదైన మరణాలు, కోలుకుంటున్న వారి శాతం.. ఇవన్నీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండటం మాత్రం స్పష్టం అవుతోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు