తెలంగాణ ఎమ్మెల్సీ ఫైర్బ్రాండ్ జర్నలిస్టుగా పేరొందిన రాణీరుద్రమరెడ్డి నిలిచారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి ఆమె పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు తెలంగాణ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్పై నేడు (శనివారం) భద్రాచలంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. జర్నలిస్టుగా ప్రముఖ చానల్ టీవీ9లో రాణీరుద్రమ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
సామాజిక స్పృహ, ప్రశ్నించేతత్వం మెండుగా ఉన్న రాణీరుద్రమ రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. మొదటగా ఆమె వైసీపీలో చేరి కొంత కాలం యాక్టీవ్గా పని చేశారు. అయితే తెలంగాణ విభజనకు వ్యతిరేకంగా వైసీపీ నిర్ణయం తీసుకోవడంతో, ఆ పార్టీ నుంచి ఆమె బయటికి వచ్చారు.
ఆ తర్వాత కొంతకాలం టీఆర్ఎస్ అనుకూల చానల్ టీ న్యూస్లో ఆమె పనిచేశారు. అక్కడి నుంచి బయటికొచ్చిన తర్వాత మరో చానల్లో చేరి, సామాజిక అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తనదైన శైలిలో చర్చలు నిర్వహిస్తూ, పాలకప్రతిపక్షాలను నిగ్గదీస్తూ ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం పూర్తిస్థాయిలో తెలంగాణ సమస్యలపైనే దృష్టి సారించి, వాటి పరిష్కారానికి పాలకులతో పోట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వరంగల్ నివాసైన ఆమె పంచ్ డైలాగ్లతో కేసీఆర్, మోడీ పాలనలపై విరుచుకుపడుతున్నారు.
తనను గెలిపిస్తే ప్రైవేట్ రంగంలో 80శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా లోకల్ రిజర్వేషన్ యాక్ట్ కోసం కృషి చేస్తానంటున్నారు. భద్రాచలం అభివృద్ధికి రూ.100కోట్లు ప్రకటించి అభివృద్ధి చేయాలని కోరుతూ గతంలో యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో దీక్షలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే భద్రాచలం దేవస్థానం పేరు మీద ఏపీలో ఉన్న 1,100 ఎకరాలను స్వాధీన పర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలోకి వెళ్లిన ఐదు ముంపు గ్రామ పంచాయతీలను మళ్లీ తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం శనివారం భద్రాచలంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించ నున్నట్లు ఆమె తెలిపారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు