Advertisement

Advertisement


Home > Politics - Political News

నీ క‌థేందో చూస్తామ‌న్న హైకోర్టు!

నీ క‌థేందో చూస్తామ‌న్న హైకోర్టు!

తెలంగాణ హైకోర్టులో నిన్న ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఓ కేసుకు సంబంధించి విచార‌ణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం పిటిష‌నర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. అంత బలవంతుడివైతే నీ క‌థేందో తామే చూస్తామ‌ని, ఈ వ్యవహారాన్ని ప‌ర్య‌వేక్షిస్తామ‌ని తీవ్ర హెచ్చ‌రిక చేయ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌ గ్రామ పంచాయతీలోని 1,200 చదరపు గజాల స్థలంలో వి.గోపాల్ రావు అనే వ్యక్తి నిర్మాణం చేపట్టారు. అది అక్రమ నిర్మాణమంటూ పంచాయతీ ఏప్రిల్‌ 21న కూల్చివేతకు నోటీసులు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిష‌న్‌ను కొట్టివేస్తూ సింగిల్ జ‌డ్జి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. గోపాల్‌రావు దౌర్జ‌న్యాన్ని రికార్డ్ చేశారు.  

పంచాయతీ తీర్మానాన్ని సవాలు చేయకపోవడంతోపాటు హైకోర్టులో ఉన్న మరో పిటిషన్‌ వివరాలను తొక్కిపెట్టడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. అలాగే కలెక్టర్‌, ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించారు. 

‘మీ (గోపాలరావు)పై చర్య తీసుకోవడానికి జిల్లా పంచాయతీ అధికారి చేతులెత్తేశారు. గతంలో పంచాయతీ కార్యదర్శి, తదితరులను బదిలీ చేయించారు. అక్రమ నిర్మాణంపై ఓ వ్యక్తి పిటిషన్‌ వేయగా ఆయన న్యాయవాదిని బెదిరించారు. ఉపసంహరించుకోవడానికి నిరాకరించడంతో భౌతిక దాడులకు పాల్పడ్డారు. బలవంతంగా ఎన్వోసీపై సంతకం తీసుకున్నారు. మరో న్యాయవాది వస్తే ఆయన్నూ బెదిరించారు’  అని పేర్కొంటూ గోపాలరావు పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై గోపాలరావు దాఖలు చేసిన అప్పీలుపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం పిటిష‌న‌ర్ వ్య‌వ‌హారంపై ఆశ్చ‌ర్య‌పోవ‌డంతో పాటు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  

అధికార పార్టీ అండ‌తో పిటిష‌న‌ర్ విర‌వీగుతుండ‌డాన్ని సింగిల్‌ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని ధ‌ర్మాస‌నం ప్రస్తావిస్తూ ‘ఎంత బలవంతుడివో తామూ చూస్తామని, ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తామని’ పిటిషనర్‌ను తీవ్రంగా హెచ్చ‌రించింది.

అధికార పార్టీ అండ‌తో రెచ్చిపోతున్న వ్య‌క్తిపై హైకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అభాగ్యుల‌కు న్యాయ వ్య‌వ‌స్థ ఓ భ‌రోసా క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?