పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదు అవుతూ ఉంది. తొలి దశ పోలింగ్ లో 84.13 శాతం , రెండో దశ పోలింగ్ లో 86.11 శాతం, మూడో దశ పోలింగ్ లో 84.61 శాతం పోలింగ్ నమోదు కాగా నాలుగో దశల పోలింగ్ లో 79.90 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మిగతా దశల పోలింగ్ కు ప్రస్తుతం ప్రచారం కొనసాగుతూ ఉంది.
ప్రచారంలో టీఎంసీ, బీజేపీల మధ్యన మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. బెంగాల్ లో అధికారం సాధించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కీలక నేతలు పని చేస్తూ ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా .. దీదీ, దీదీ అంటూనే మమతను లక్ష్యంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో భారీగా పోలవుతున్న ఓట్లు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది ఆసక్తిదాయకంగా మారింది.
సాధారణంగా అధిక పోలింగ్ శాతం నమోదు కావడం అనేది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని చెబుతూ ఉంటారు విశ్లేషకులు. ఈ ఇలా చూస్తే ఏకంగా సగటును 82 శాతానికి మించి నమోదైంది బెంగాల్ లో పోలింగ్! 75 శాతం స్థాయి పోలింగ్ నమోదు కావడమే ఇండియాలో గొప్ప. ఎందుకంటే.. ఓటర్ల జాబితాలో బోలెడన్ని లోటుపాట్లు ఉంటాయి. డబుల్ ఎంట్రీలూ, చనిపోయిన వారి ఓట్లను తొలగించకపోవడం, రెండు మూడు ఊర్లలో ఓటర్ల జాబితాలో నమోదైన వారు.. ఇలాంటి లిస్టులను సీఈసీ ఎప్పటికప్పుడు క్లియర్ చేయలేదు. దీంతో కనీసం పది శాతం ఓట్లను ఈ లెక్కలో తీసేయొచ్చు.
ఇక యథారీతిన పోలింగ్ పట్ల అనాసక్తి చాలా మందిలో ఉంటుంది. ఓటర్ ఐడీ ని కేవలం గుర్తింపు కార్డు కాబట్టి మాత్రమే వారు పెట్టుకుంటారు. పోలింగ్ రోజున క్యూలలో నిలబడి ఓటేసేంత ఆసక్తి లేని వారు ప్రజాస్వామ్య భారతదేశంలో ఎంతో మంది. కాబట్టి.. చాలా ఎన్నికల్లో 60 నుంచి 70 శాతం పోలింగ్ నమోదు కావడం కూడా ఎక్కువే!
ఇలాంటి నేపథ్యంలో 75 శాతం స్థాయి పోలింగ్ నమోదు అయితే ప్రజలు బారులు తీరినట్టే! అయితే బెంగాల్ లో ఈ సగటు ఏకంగా 83 శాతం ఉంది. ఓటర్ల జాబితాలోని లోటు పాట్లను పరిగణనలోకి తీసుకుంటే.. బెంగాల్ లో పలు దశల్లో ఏకంగా వందకు వంద మందీ ఓటు హక్కును వినిగించుకున్నట్టే!
మరి ఇదంతా పదేళ్ల మమత పాలన మీద వ్యతిరేకతేనా? అనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది. మమత ఇప్పటికే పదేళ్ల పాటు పాలించేశారు. కాబట్టి ప్రజలు ఆమెను గద్దె దింపాలని అనుకోవడంలో వింత ఏమీ లేదు. ఇదే సమయంలో మమతకు ప్రత్యామ్నాయంగా తామే అధికారాన్ని సంపాదించుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలూ చేసింది. మరి అసలు కథ ఏమిటో, పశ్చిమ బెంగాల్ లో విజేత ఎవరో మే రెండుతో తేలిపోతుంది.
ఇక భారీ స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడానికి ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కారణమా అంటే.. దీనికి మరో కారణం కూడా కనిపిస్తూ ఉంది. అటు అధికార టీఎంసీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దానికి తోడు కమ్యూనిస్టులు-కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా తమ వంతుగా హంగామా చేస్తూ ఉన్నాయి.
ఇన్ని పార్టీలు, ఈ పార్టీలన్నింటికీ క్షేత్ర స్థాయిలో ఉనికి ఉండటంతో అన్ని పార్టీల కార్యకర్తలూ కూడా ఓటర్లను బూత్ లకు తీసుకెళ్లడానికి తీవ్ర కసరత్తులు చేయడంతో కూడా పోలింగ్ శాతం గణనీయంగా పెరిగి ఉండవచ్చు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు