కోవిడ్ మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే బలి తీసుకుంటోంది. చిన్నారులకు తల్లిదండ్రులను దూరం చేస్తోంది. తల్లిదండ్రులకు బిడ్డలను దూరం చేస్తోంది. కోవిడ్ బాధితులను కదిలిస్తే కన్నీళ్ల వరదే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ తన పెద్ద మనసు చాటుకుంది. మాతృహృదయాన్ని ప్రదర్శించింది.
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల గుండె ఘోషను "నేను విన్నా, నేను ఉన్నా" అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలు కారని, వారికి తమ ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తుందని జగన్ సర్కార్ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా ఓ ప్రకటన చేశారు.
కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను అక్కున చేర్చుకుని బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి, రక్షణ కల్పించేందుకు తమ శాఖ చర్యలు చేపట్టిందని ఆమె వెల్లడించారు. అలాంటి పిల్లల కోసం ప్రతి జిల్లాలోనూ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఆమె తెలిపారు.
ఇప్పటికే 24 గంటలూ పనిచేసే టోల్ఫ్రీ నెంబర్లు 181, 1098 అందుబాటులోకి తెచ్చామని, ఎవరైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి అలాంటి పిల్లల సమాచారం అందించవచ్చని కృతికా శుక్లా పేర్కొన్నారు. అంతేకాదు, తల్లిదండ్రులిద్దరూ కరోనాకు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుంటే, వారి పిల్లల ఆలనాపాలనా కూడా ఈ కేంద్రాల్లోనే చూడనున్నట్లు ఆమె తెలిపారు.
జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎందుకంటే కరోనా మొట్ట మొదటి బాధితులు పిల్లలే. తల్లిదండ్రులిద్దరూ కరోనా బారిన పడితే పిల్లలు వీధిపాలవుతున్నారు. ఈ సమస్యను గుర్తించి వెంటనే ఆశ్రయం కల్పించడం ఓ పెద్ద ఊరటగా చెప్పొచ్చు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు