భారత్ పట్ల అమెరికా ఆపేక్ష ఏదైనా ఉందంటే... అది ఆయుధాలు అమ్మడానికి మాత్రమే అనే విషయం మరోసారి రుజువు అయ్యింది. అమెరికా అధ్యక్షులంతా ఇండియా వంటి దేశాన్ని తమ ఆయుధాలు అమ్మడానికి ఒక మార్కెట్ గా చూస్తారు. వారిలో ట్రంప్ మరింత ముదురు! మిగతా వాళ్లు షుగర్ కోటెడ్, ట్రంప్ ఆ మాత్రం కూడా కాదు. ట్రంప్ భారత పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చి, వెళ్లడంలో పైపై ముచ్చట్లకు మీడియా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంది. ఇవాంక అందం గురించి, మెలనియా డ్రస్సుల గురించి ప్రింట్ మీడియాలో పేజీలకు పేజీలు రాశారు. తెలుగు జర్నలిస్టులు కవులు అయిపోయి.. వారి అందాలను వర్ణించారు. మన మీడియా ఇలాంటి విషయాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంది.
అమెరికాది ఆయుధ వ్యాపారం. ప్రపంచానికి ఆయుధాలను అమ్ముకోవడం దాని వృత్తిగా కొనసాగుతూ ఉంది. తన ఆయుధాల అమ్మకం కోసం కొన్ని దేశాల మధ్యన అశాంతిని రగల్చడానికి కూడా వెనుకాడదు అనే అభిప్రాయాలు ఇప్పటివి ఏమీ కాదు. ఇరుగూపొరుగున శత్రువులను పెట్టుకున్న ఇండియా కన్నా అమెరికాకు ఆయుధాలను కొనే వినియోగదారుడు మరొకడు కనిపించడేమో! ఈ క్రమంలో ఇండియాతో మరోసారి ఆయుధ వ్యాపారాన్ని చేసుకుంటోంది అమెరికా. తన లక్ష్యాలను పూర్తి చేసుకుంటోంది. ఆపై తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని భారత్ లోని పెట్టుబడి దారులను కోరి వెళ్లాడు ట్రంప్. ఇదీ ట్రంప్ ఇండియా పర్యటనలోని అసలు కథ. ఇక సబర్మతీ,తాజ్ మహల్, మెలానియా, ఇవాంకా, మోడీతో ట్రంప్ హగ్స్.. ఇవన్నీ కొసరు విషయాలే!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు