ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ ఓ మాట అంటే దాని మీదే వుంటారు. ఆరు నూరైనా..నూరు ఆరైనా. అలాంటిది ఆయన ఇప్పుడు మాటను పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. రెండున్నరేళ్ల క్రిందట అధికారంలోకి వచ్చినపుడు మంత్రి వర్గం ఏర్పాటు చేస్తూ ఇచ్చిన మాట ఏమిటంటే, రెండున్నరేళ్ల తరువాత ఈ మంత్రులను రాజీనామా చేయించి కొత్తవారికి అవకాశం ఇస్తానని. ఆ విధంగా అందరికీ అవకాశం వచ్చేలా చూస్తానని.
అధికారంలోకి వచ్చాక చాలా అంటే చాలా పదవులు పంపిణీ చేసారు. కొత్త కొత్త పదవులు క్రియేట్ చేసారు. అంతవరకు బాగానే వుంది. కానీ మంత్రి వర్గాన్ని సమూలంగా మార్చడం అనే విషయం దగ్గరకు వచ్చేసరికి జగన్ జంకేసినట్లు కనిపిస్తోంది. సమూలంగా మంత్రి వర్గాన్ని మార్చినా లేదా, కొంత వరకు మార్చినా పార్టీలో అసంతృప్తి ప్రబలుతుందని ఆయన భయపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే రఘురామ కృష్ణం రాజు తో తలకాయ నొప్పి పడుతున్నారు. మరి కొందరు రఘురామకృష్ణం రాజులను కోరి తయారు చేసుకోవడం అనవసరం అని జగన్ భావిస్తున్నారేమో? మంత్రివర్గం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే కొంత మంది మంత్రుల అసమర్థత బయటపడినట్లు వార్తలు వినిపించాయి. విస్తరణ లేదా పునర్వవస్థీకరణలో వీరికి ఉద్వాసన తప్పదని వినిపించింది.
రెండున్నరేళ్ల తరువాత సమూలంగా మార్చేస్తారని, బుగ్గన, పెద్దిరెడ్డి వంటి కీలకమైన వారికి కూడా ఉద్వాసన తప్పదని, సీనియర్లు అందరినీ పార్టీ పదవుల్లోకి పంపిస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే జగన్ అస్సలు ఆ ఆలోచనలోనే వున్నట్లు కనిపించడం లేదు.
కదిపితే కందిరీగల తుట్ట అని భయపడుతున్నారో? లేక అసలే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ, వాటి కోసమే సమయం అంతా వెచ్చిస్తూ, మిగిలిన విషయాలను అబేయన్స్ లో పెట్టారో? తెలియాల్సి వుంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు