Advertisement

Advertisement


Home > Politics - Political News

వైకాపా అధినేత వైఎస్ జ‌గన్ తో ముఖాముఖి

వైకాపా అధినేత వైఎస్ జ‌గన్ తో ముఖాముఖి

వైకాపా అధినేత, ఆంధ్ర సిఎమ్ ఇంటర్వ్యూలు ఇచ్చి చాలా కాలం అయింది. ఆ మాటకు వస్తే మీడియాను కలిసి చాలా కాలం అయింది. ఆయన కనుక మీడియా ముందుకు వచ్చినా, ఇంటర్వ్యూ ఇచ్చినా ఎలా వుంటుంది. ఏదైనా దేవుడిదే భారం అనే సిఎమ్ ప్రశ్న..ప్రశ్నకు అదే వల్లించినా ఎలా వుంటుంది? ఇది ఎవరినీ నొప్పించడానికి కాదు. సరదాగా చదువుకోడానికి..ఊ..ఉత్తుత్తినే.

నమస్కారం జ‌గన్ గారూ

నమస్తే అన్నా..

మీడియాకు ఎందుకు దూరంగా వుంటున్నారు.

ఇప్పుడు ఆ అవష‌రం ఏముందన్నా..మీరు రాసేవి రాస్తూనే వున్నారు. ఆ యొక్క ప్రజ‌లు, ఆ పైన దేవుడు అంతా చూస్తూనే వున్నారు.

ఈ మాత్రం దానికి ప్రజ‌లు, దేవుడు వరకు ఎందుకు లెండి. ఇంతకీ మీ పాలన మీకు సంతృప్తికరంగా వుందా?

ప్రతి అవ్వా సంతోషంగా వున్నారు. ప్రతి తాతా సంతోషంగా వున్నారు.ఆపైన దేవుడు వుండనే వున్నాడు కదన్నా.

రాష్ట్రం అప్పులపాలు అవుతోందని ఆరోపణలు వున్నాయి.

నేను పాదయాత్రలో విన్నాను. చూసాను. హామీలు ఇచ్చాను. నిలబెట్టుకోవాలి కదన్నా.

మరీ అప్పులు చేసా

మనం ఏం చేసాం అన్నది జ‌నం చూస్తారు కానీ ఎలా చేసారు అన్నది చూడరన్నా. మనం చేసేది చేయాలి అంతే.

మద్యపాన నిషేథం అన్నారు. కానీ వినియోగం పెరుగతోంది అని వార్తలు వస్తున్నాయి

అన్నా..పెరుగుట విరుగుట కొరకే అన్నారు కదన్నా. ఇదీ అలాగే జ‌రుగుతుంది. చూడండన్నా.

ఇసుక విధానాలు వికటిస్తున్నాయి. ఇసుక రేటు పెరిగిపోతోంది అని గోల పెడుతున్నారు.

అన్నా. ఇది అభివృద్ది సంకేతంగా చూడాలి. రాష్ట్రంలో ఇసుక డిమాండ్ పెరిగింది అంటే నిర్మాణాలు అంతలా పెరిగాయన్నమాట. అందుకే ఇసుక రేట్లు పెరిగాయి తప్ప వేరు కాదన్నా.

అసలు ఇలా డబ్బులు పంచుకుంటూ పోవడం సరైన విధానమే అంటారా? జ‌నాలను బద్దకిష్టులను చేయడం కాదా?

అన్నా నేను ఇచ్చిన డబ్బులు అన్నీ ఎక్కడకు వెళ్తున్నాయి. జ‌నం నుంచి మార్కెట్ లోకే కదా? అంటే మనీ సర్క్యలేషన్ పెరిగింది కదన్నా. దీని వెనుక ఎకనామిక్స్ వుందన్నా. కొంచెం మీరు అర్థం చేసుకోవాలన్నా.

కానీ రాష్ట్రం మీద అప్పుల భారం పెరగిపోతోంది కదా

ఒకసారి ప్రజ‌లు ఆర్థికంగా బలపడితే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీర్చీయచ్చు అన్నా. అయినా చంద్రబాబు హయాంలో ఎన్ని అప్పలు చేసారో మీకు తెలిసే వుంటుంది కదా అన్నా.

మిమ్మల్ని వర్క్ ఫ్రమ్ సిఎమ్ అని, హోమ్ సిక్ సిఎమ్ అనీ అంటున్నారు.

అన్నా ప్రతిపక్షాలు ఏదో ఒకటి అంటూ వుంటాయి. అది వారి పని. నేను నా పని చేసుకుంటూ వెళ్లడమే కానీ అవేమీ పట్టించుకోనన్నా.

మరేం పట్టించుకుంటారు మీరు

అన్నా..నవరత్నాల హామీలు అన్నా, మాట ఇచ్చాము. మడమ తిప్పకుండా నిలబెట్టుకుంటున్నాము కదన్నా.

నవరత్నాలు సరే, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అంటున్నారు.

అధికారులను ఆదేశించాం అన్నా. అన్ని రోడ్లు వానాకాలం అయిపోగానే తక్షణం రిపేర్లు చేయించాలని అన్నాం అన్నా

అదేశాలే కనిపిస్తున్నాయి నిత్యం. కానీ అమలు కనిపించడం లేదు.

ఆ యొక్క ప్రజ‌ల ఆశీస్సులతో అన్నీ జ‌రుగుతాయన్నా.

మీరు మళ్లీ ప్రజ‌ల్లోకి వెళ్తారని వినిపిస్తోంది. మీకు ఇది వరకటి ఆదరణ మళ్లీ లభిస్తుందని నమ్మకం వుందా?

ఎందుకు లేదన్నా. జ‌నం నాతోనే వున్నారన్నా, లేదంటే అన్ని ఎన్నికల్లో అలా విఙయం సాధించలేం కదా?

ఆ ఎన్నికలన్నీ పోలీసు బలంతో గెలిచారని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ప్రతిపక్షాలు కదన్నా అలా అనడం వారి పని. వాళ్లు గెలిచినపుడు మేం అలా అనలేదు కదన్నా

మీరు కేంద్రంతో రాఙీ పడిపోయారా?

ఎకడన్నా. పెట్రోలు ధరలు పెంచింది కేంద్రమే అని ఫుల్ పేఙీ ప్రకటనలు ఇచ్చి మరీ చెప్పాం కదన్నా

మీ చేతిలో వున్న పన్నులు తగ్గిస్తే బాగుంటుందేమో?

పెట్రోలు ధరల కన్నా నవరత్నాలు హామీలు ముఖ్యం కదన్నా. సకాలంలో అక్కౌంట్లో డబ్బులు పడకపోతేె అవ్వ.తాత బాధపడతారు కదన్నా.

మీరు రాత్రి పూట దేవుళ్లతో, ఆత్మలతో మాట్లాడతారని గ్యాసిప్ లు వున్నాయి.

మీరు దేవుడ్ని తలచుకోరా అన్నా..దేవుడికి ఏమీ విన్నవించుకోరా అన్నా.

మీరు ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్లు అంత సులువుగా ఇవ్వరంట నిజ‌మేనా

అన్నా ఎమ్మెల్యేలను ప్రజ‌లు ఎన్నుకున్నారు. వాళ్లు వాళ్లకి అందుబాటులో వుండాలి నా దగ్గరకు వస్తే ఎలా అందుకే తప్ప వేరు కాదన్నా.

మీది తుగ్లక్ పాలన అని అంటున్నారు.

అవన్నీ ఆ రెండు పత్రికల, రెండు చానెళ్ల మాటలు అన్నా, జ‌నం పట్టించుకోరన్నా.

మీరు ప్రతీదీ ప్రతిపక్షాల మీదా, మీడియా మీద నెట్టేస్తారా?

అలా ఎందుకన్నా..మీరు అలా అటు ఇటు అడుగుతారనే నేను మీడియాకు దూరంగా వుంటానన్నా

చంద్రబాబు తొలిసారి వెక్కి వెక్కి ఏడ్చారు..కారణం మీ పార్టీ జ‌నాలే కదా

అవునా అన్నా. ఏడ్చారా అన్నా..అధికారం ఎప్పటికీ మళ్లీ అందదని ఏడుపు వచ్చిందేమో అన్నా

ఇంతకీ మీ పాలనకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు

తొమ్మిది అన్నా

అదేంటీ..

ఆ అంకే కదా అన్నా నాకు కలిసివచ్చింది. అధికారం ఇచ్చింది.

మీరు ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు

చూద్దాం అన్నా పైన దేవుడు వున్నాడు. ప్రజ‌లు వున్నారు. మళ్లీ కలుద్దాం అన్నా..ఉంటా..అన్నా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?