రూ.5 వేల జీతం పెంచాలని, పని ఒత్తిడి తగ్గించాలని ఆ మధ్య వాలంటీర్లు రోడ్డెక్కి ఆందోళన చేశారు. అయితే వాలంటీర్లది ఉద్యోగం కాదని, సేవ మాత్రమేనని, జీతం పెంచాలని అడగడం సరికాదని సుద్దులు చెబుతూ బహిరంగ లేఖ రాశారు జగన్.
వాలంటీర్ల వ్యవస్థను తానే రూపొందించి, వారి కష్టాలను తానే గుర్తించలేదేమోనన్న భావన మాత్రం జగన్ లో ఉండిపోయినట్టు అర్థమవుతోంది. అదే లేఖలో పురస్కారాలిస్తామని చెప్పిన జగన్, వాటిని నగదు బహుమతులుగా మార్చేసి వాలంటీర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పారు.
ఏకంగా రూ.10వేలు, రూ.20వేలు, రూ.30వేలు నగదు పురస్కారాలను ప్రకటించబోతోంది జగన్ సర్కారు. ఏడాదిపాటు ఎప్పుడూ సెలవు తీసుకోకుండా, గ్యాప్ లేకుండా వాలంటీర్ గా సేవలందించిన వారికి తొలి కేటగిరీ కింద సేవా మిత్ర అనే పురస్కారం ఇస్తారు.
ఇలాంటి వారందరికీ రూ.10వేలు ఆర్థిక ప్రోత్సాహం ఇస్తారు. దాదాపుగా వాలంటీర్ వ్యవస్థలోని 90శాతం మంది ఈ పురస్కారానికి అర్హులవుతారని అంచనా. సెలవలు పెట్టి, మధ్యలో విధులకు హాజరు కాకుండా మిగిలిపోయిన 20శాతం మంది దీనికి అర్హులు కాబోరు.
ఇక కేటగిరీ-2. సేవారత్నాలు. ప్రతి మండలం లేదా, పట్టణంలో ఐదుగురిని సేవా రత్న కేటగిరీ కింద ఎంపిక చేస్తారు. వీరికి పురస్కారం, స్పెషల్ బ్యాడ్జి, రూ.20వేలు నగదు బహుమతి అందిస్తారు.
కేటగిరీ-3. సేవా వజ్రం. నియోజకవర్గ స్థాయిలో ఐదుగురు వాలంటీర్లను సేవా వజ్రం కేటగిరీ కింద ఎంపిక చేస్తారు. గ్రామస్తులతో వాలంటీర్లు మెలిగే విధానం, నెలలో మొదటి మూడు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ టార్గెట్ పూర్తి చేయడం, యాప్ ల వినియోగంలో చురుగ్గా ఉండటం, టెక్నాలజీని అలవాటు చేసుకోవడం, నవరత్నాల అమలులో భాగస్వామ్యం, కొవిడ్-19 సర్వే లాంటి అంశాలన్నీ వాలంటీర్ల పనితీరు మదింపు చేయడంలో ఉంటాయి.
ఇలా గ్రేడ్లు ఇస్తూ వారికి ఎప్పటికప్పుడు పురస్కారాలు అందజేస్తుంది ప్రభుత్వం. తొలి విడతగా ఉగాదితో వాలంటీర్ల పురస్కారాలు మొదలవుతాయి. స్వయంగా సీఎం జగన్, మూడు ప్రాంతాల్లో వాలంటీర్లకు పురస్కారాలిచ్చే కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు.
మొత్తమ్మీద వాలంటీర్ల వ్యవస్థలో వస్తున్న నిరసనను ముందుగానే పరిష్కరించగలిగారు సీఎం జగన్, ప్రతిపక్షాల మాయలో పడి భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా వారికి సుద్దులు చెప్పారు, ఇప్పుడు పురస్కారాల పేరుతో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు