జగన్ పాలన ప్రత్యర్థి పార్టీల నేతలకు చాలా విషయాలనే గుర్తు చేస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి మాత్రం ఏకంగా తన పెళ్లి నాటి రోజుల్ని జగన్ పాలన గుర్తుకు తేవడం గమనార్హం.
ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి అనేది మధురమైన ఘటన. పెళ్లి నాటి రోజుల్ని నెమరు వేసుకోవడం అంటే ...ఆనందలోకంలో విహరించడమే. అయితే దగ్గుబాటి పురందేశ్వరికి పెళ్లి నాటి రోజుల్ని జగన్ పాలన గుర్తు చేసిన సందర్భంగా కాస్త విభిన్నంగా ఉంది. అదేంటో తెలుసుకుందాం.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున పురందేశ్వరి చిత్తూరు జిల్లా నాగలాపురంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పాలనలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించలేదని చెప్పడానికి తన పెళ్లి నాటి సంగతిని పోల్చి చెప్పారు. అదెలాగో ఆమె మాటల్లోనే...
"నా వివాహ సమయంలో ఉదయం 9.40 గంటలకు ఆకాశంలో అరుంధతి నక్షత్రం కనపడుతోందా? అని అర్చకులు అడిగారు. కొత్త పెళ్లి కూతురిని కావడంతో కనబడుతోందని అబద్ధమాడా. ఇదే రీతిలో రాష్ట్రంలో అభివృద్ధి ఏ మాత్రం లేకున్నా నేతలు అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి లేకపోగా... వైసీపీ పాలనలో దోపిడీ సాగుతోంది" అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలనను విమర్శించే అత్యుత్సాహంలో పురందేశ్వరి ఓ నిజాన్ని చెప్పారు. అరుంధతి నక్షత్రం కనిపించడం ఎంత నిజమో, ఏపీలో అభివృద్ధి కూడా అంతే నిజమని ఆమె వెటకారంగా చెప్పడం ఆకట్టుకుంది. కానీ టీడీపీ హయాంలో అభివృద్ధి లేదని చెప్పడం ద్వారా, ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయిన తమ పార్టీ కూడా రాష్ట్రానికి చేసేందేమీ లేదనే వాస్తవాన్ని ఒప్పుకున్నట్టైంది.
దాదాపు నాలుగేళ్ల పాటు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో టీడీపీ, బీజేపీలు అధికారాన్ని పంచుకున్న సంగతిని పురందేశ్వరి మరిచి పోయినట్టున్నారు. ఎలాగైతే తాను పెళ్లి రోజు అరుంధతి నక్షత్రం కనిపిస్తోందని అబద్ధమాడానని ఒప్పుకున్నారో, ఇప్పుడు బీజేపీ కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదని పురందేశ్వరి అంగీకరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు