Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి

జ‌గ‌న్ స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి

టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సుప్రీంకోర్టు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి అయింది. టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు నేడు ఏపీ ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. 

అఫిడ‌విట్‌లో పూర్తి వివ‌రాలు లేకపోవ‌డంపై సుప్రీంకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అఫిడ‌విట్‌లోని ప‌లు అంశాల‌ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మూడో వేవ్ వస్తే అప్పుడు ఏం చేస్తారని స‌ర్వోన్న‌త‌ న్యాయస్థానం ప్రశ్నించడం గ‌మ‌నార్హం.

ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. మన నిర్ణయాలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించే గదుల వివరాలు కూడా అఫిడ విట్‌లో ఎక్కడా లేవని.. ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని వ్యాఖ్యానిం చింది. కరోనా వేళ ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది కూర్చోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది.

15 రోజుల ముందుగా టైం టేబుల్‌ ఇస్తామంటున్నారు..ఆ సమయం సరిపోతుందని ఎలా చెప్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూశాం కదా అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది.

విద్యార్థుల‌కు వేలకొద్దీ పరీక్ష గదులను ఎలా అందుబాటులోకి తీసుకొచ్చి, సమన్వయం చేయగలుగుతార‌ని ప్ర‌శ్నించింది. పరీక్ష నిర్వహించాము.. పని అయిపోయింది అనుకోలేం కదా అని ఏపీ స‌ర్కార్‌ను నిల‌దీసింది. పరీక్షల నిర్వ‌హ‌ణ‌, వాటి  మూల్యాంకనం, ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది.. ఇవేమీ మీ అఫిడవిట్లో కనిపించలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

రెండో దశ తీవ్రతను చూసి.. పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెపుతున్నా ఎందుకు ఇలా వ్యవహ‌రిస్తున్నార‌ని జ‌గ‌న్ స‌ర్కార్ మొండి ప‌ట్టుద‌ల‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. అవసరమైతే సీబీఎస్ఈ, యూజీసీ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాలు తీసుకోవాలని ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. గ్రేడ్ల ను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికీ, పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని హిత‌వు చెప్పింది. 

కొంత సమయం ఇస్తే.. చర్చించి ప్రభుత్వం నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ న్యాయవాది కోర్టుకు విన్న‌వించింది. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని, ఈ వ్యవహారం విద్యార్థులపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలని సుప్రీం పేర్కొంది. దీనిపై విచారణను రేపే చేపట్టనున్నట్లు జస్టిస్‌ ఖన్వీల్‌కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం స్పష్టం చేసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?