ఇటీవల కాలంలో అంతోఇంతో ఈనాడు పత్రికే జగన్ సర్కార్కు అండగా నిలుస్తోంది. కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని ఏపీ సీఎం జగన్ అన్నప్పుడు ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అవహేళన చేశాయి. ఆ సమయంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నారాయణమూర్తి కరోనాపై మాట్లాడిన మాటలు జగన్ అభిప్రాయాలను సమర్థించినట్టు ఉన్నాయి. అలాగే ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజణ్ వెల్లడించిన విషయాలు కూడా జగన్ వైఖరిని సమర్థించేలా ఉన్నాయి. వీటికి ఈనాడు పత్రిక ప్రాధాన్యం ఇస్తూ ప్రచురించి జగన్ స్థాయిని పెంచింది. ఆ పని చేయాల్సిన సాక్షి పత్రిక చేష్టలుడిగి చూస్తుండి పోయింది.
తాజాగా జగన్ సర్కార్ పరపతిని, పాలణౄ దక్షతను పెంచే సమాచారాన్ని ఈనాడు తన మొదటి పేజీలో రాసింది. సాక్షి మాత్రం ఎప్పట్లాగే విస్మరించింది. సాక్షి చివరి పేజీలో ఇండస్ట్రీ ఇన్ఫో పేరుతో ఓ కాలమ్ ఇచ్చినప్పటికీ అందుకు సంబంధించిన ప్రధాన సమాచారం లేకపోవడం ఆ పత్రిక జగన్కు ఎంత మాత్రం ప్రయోజనకారో అర్థం చేసుకోవచ్చు.
జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాదిలో సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంపకాలు తప్ప రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే ఏ ఒక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ నేపథంలో "రాష్ట్రంలో 9 భారీ పరిశ్రమలు" శీర్షికతో ఈనాడు ప్రచురించిన కథనం అందరి దృష్టి ఆకర్షించింది. రూ.18 వేల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్టు ఆ కథనం సారాంశం. ఇక కథనంలోకి వెళితే ఆసక్తికర విషయాలు తెలిసొస్తాయి.
"ఏపీలో రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో తొమ్మిది భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. శుక్రవారం నిర్వహించే రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపనుంది. వాటికిచ్చే ప్రోత్సాహకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా నిర్వహించిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల కమిటీ (ఎస్ఐపీసీ)లో అధికారులు చర్చించారు. వీటితో పాటు శ్రీసిటీలో జపాన్కు చెందిన పది పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వాటి ద్వారా మరో రూ.6 వేల కోట్లు పెట్టుబ డులు రాష్ట్రానికి రానున్నాయి. శ్రీసిటీ యాజమాన్యం ఇప్పటికే సంబంధిత సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పరిశ్రమశాఖ వర్గాలు తెలిపాయి.
ఈ పరిశ్రమలను అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్టు ఈనాడు కథనంలో పేర్కొన్నారు. జగన్ పాలనలో ఇదో పెద్ద ముందడుగు. ఎందుకంటే ఎంతసేపూ సంక్షేమ పథకాల పేరుతో డబ్బంతా జనానికి పంచుతూ పోతే...రాష్ట్రానికి ఆదాయం వచ్చేదెట్టా? అనే ప్రశ్న ప్రతి ఒక్కర్నీ తొలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రూ.18 వేల కోట్లతో పరిశ్రమల స్థాపనకు జగన్ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకోనుండటం అభినందించదగ్గ విషయం. అలాగే జగన్ సర్కార్ వల్ల పరిశ్రమలు తరలిపోతున్నాయని విమర్శించే వాళ్లకు ఇదో గట్టి సమాధానం.
అధికార పత్రికగా పేరొందిన సాక్షిలో ఎందుకని ఈ సమాచారం లేదు. జగన్ సర్కార్ ఇమేజ్ను పెంచే ఇలాంటి వార్తలకు సాక్షిలో చోటు ఎందుకు దక్కడం లేదు. రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించే కథనం ఈనాడులో రావడమే జగన్కు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందని చెప్పొచ్చు.
ఎందుకంటే జగన్ సర్కార్ అన్ని విధాలా ఫెయిల్యూర్ అయ్యిందని జనానికి తెలియజేయాలని తపన పడే ఈనాడు...అందుకు విరుద్ధమైన సమాచారాన్ని ప్రచురించడం సహజంగానే పాఠకులను, ప్రజల్ని ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. ఏది ఏమైతేనేం భారీ పరిశ్రమల రాకకు సంబంధించిన కథనాన్ని ప్రచురించడం ద్వారా జగన్ సర్కార్కు ఈనాడు వెన్నుదన్నుగా నిలిచినట్టైంది. ఈ విషయంలో ఈనాడును అభినందించాల్సిందే.
-సొదుం
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు