ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసం చూస్తే ... ఒక్కోసారి భయమేస్తుంది. సహజంగా న్యాయస్థానాల విషయంలో రాజకీయ నేతలు, వ్యాపారులు , ఇతరత్రా ఎవరైనా చాలా లౌక్యంగా పోతుంటారు. న్యాయస్థానాల్లోనూ, వెలుపల న్యాయ వ్యవస్థపై తమకు చాలా గౌరవ మర్యాదలున్నట్టు ప్రవర్తించడం చూస్తుంటాం. న్యాయస్థానాలపై మనసులో నిజంగా ఉన్న అభిప్రాయాలను వెల్లడించే వాళ్లు చాలా అరుదు.
న్యాయస్థానాల తప్పొప్పులపై ప్రశాంత్ భూషణ్ లాంటి పేరేన్నికగన్న ఒకరిద్దరు ప్రసిద్ధ న్యాయవాదులు మాట్లాడ్డం చూస్తున్నాం. మిగిలిన వాళ్లంతా "మనకెందుకు?" అనే సర్దుబాటు ధోరణిలో వెళుతుంటారు. కనీసం న్యాయవాదులు, అరుంధతీరాయ్ లాంటి ఒకరిద్దరు పర్యావరణవేత్తలు, రచయితలు కోర్టులపై అప్పుడప్పుడు నిరసనలు వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ ఈ దేశంలో రాజకీయ నాయకులు కోర్టుల వ్యవహారశైలిపై చర్చకు దారి తీసే పరిస్థితులు కల్పించిన వాళ్లు లేరు. ఇప్పుడు ఆ ఒకే ఒక్క రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో దేశానికి కనిపిస్తున్నారు.
న్యాయస్థానాల విషయంలో జగన్ వైఖరిపై ప్రత్యర్థులు ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. కానీ ఇదే సమయంలో కోర్టుల తీరుపై మరో కోణంలో చర్చకు జగన్ ఎత్తుగడలు ఫలించాయంటే అతిశయోక్తి కాదు. అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ ఢీ అంటే ఢీ అంటుండడం ఆశ్యర్యంతో పాటు ఆయన అనుచరులకు ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియాతో కోర్టుల వ్యవహార శైలిపై మాట్లాడిన మాటలు .... ప్రభుత్వ అభిప్రా యాలే. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయాలుగానే పరిగణించాలి. గత కొన్ని రోజులుగా ఏపీ హైకోర్టు వర్సెస్ ఏపీ సర్కార్ అనే రీతిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కారణాలేవైనా ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో గ్రామస్థాయిలో కూడా ఈ పరిణామాలపై చర్చలు జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం.
నిన్న సజ్జల మాట్లాడిన వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. జగన్కు ఎంత గుండె ధైర్యం ఉందో తెలిసిపోతుంది.
"అమరావతి భూ కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం రాత్రి ఇచ్చిన ఆదేశాలు ఇదివరకెన్నడూ చూడని వని, ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది. ఇలాంటి ఆదేశాల ద్వారా న్యాయస్థానం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఎఫ్ఐ ఆర్లో ఉన్న వ్యక్తులు, దాన్లోని అంశాలు మీడియా, సోషల్ మీడియాలో రాకూడదని ఆదేశాలిచ్చింది. దీన్నో విశేషంగా, కొత్త సంప్రదాయంగా మా పార్టీ, ప్రభుత్వం భావిస్తున్నాయి.
ఎవరికో ఏదో చురుక్కుమనిపించిందనిపిస్తోంది. దాంతో పెద్దలకు ఒక న్యాయం.. సామాన్యుడికి ఒక న్యాయం ఉంటుందని అనుమానం వచ్చేట్లుగా వ్యవహరించారని భావిస్తున్నాం. ఇలాంటి చర్యల వల్ల న్యాయ వ్యవస్థకున్న నిష్పాక్షికతపై నమ్మకం సడలితే.. దానికి ఆ వ్యవస్థే బాధ్యత వహించాలి తప్ప ఇతరులను నిందిం చలేం. అసలు న్యాయస్థానాలున్నది ఎవరి ప్రయోజనాల కోసం? హక్కులు హరించి, న్యాయానికి అవకాశం లేని అశక్తులపై దౌర్జన్యం చేసినప్పుడు హైకోర్టు ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది కానీ ఇలా జరిగితే ఎలా?
సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూతుళ్లు, మాజీ అడ్వొకేట్ జనరల్.. వీళ్లంతా ఉన్నారు కాబట్టి.. వాళ్లను రక్షించాలి. దీని దారం పట్టుకుని లాగితే చివరకు చంద్రబాబు దగ్గరకు వెళుతుంది. ఇందులో ఎవరైతే తప్పులు చేశారో.. ఆ శక్తులు విజయం సాధిస్తున్నాయనే అనుమానం కలుగుతోంది. దీన్ని ఇక్కడితో వదిలిపెట్టం" అని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.
స్వతంత్ర వ్యవస్థకు చెందిన ఆ ప్రముఖ వ్యక్తి ఇద్దరు కుమార్తెల పేర్లను ఎఫ్ఐఆర్లో పెట్టినప్పటి నుంచి టీడీపీ సోషల్ మీడియా తెగ సంబరపడుతోంది. "ఎవరితో పెట్టుకోకూడదో , వాళ్లతోనే జగన్ తగువు పెట్టుకున్నాడని.... ఇక ముఖ్యమంత్రి కథ ముగిసినట్టే" అని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.
16 నెలల పాటు జైల్లో గడిపిన నేత వైఎస్ జగన్. న్యాయస్థానాలతో పెట్టుకుంటే ఏమవుతుందో ఆయనకు తెలిసినంతగా ... మరొకరికి తెలియకపోవచ్చు. అలాంటిది ఏ మాత్రం వెనుకాడకుండా, అధైర్యపడకుండా ముందుకు వెళుతున్నారంటే ... ఆయన మనసులో ఏదో వ్యూహం ఉండకపోదు. ఈ క్రమంలో మరోసారి జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడని తెగువ, లెక్కలేని తనం జగన్ నిర్ణయాల్లో కనిపిస్తోంది. వేటగాళ్లని వేటాడే మనస్తత్వం జగన్ది. అదే ఆయన్ను తిరుగులేని నేతగా నిలుపుతోంది. లాబీయింగ్, కృత్రిమ వినయ విధేయతలు జగన్ మనస్తత్వానికి పడని స్వభావాలు. విజయమో వీరస్వర్గమో అన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారనేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలే నిదర్శనం.
ఒక వైపు కుట్రలకు తెరలేపే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన చేతిలోని వ్యవస్థలు, మరోవైపు ఎల్లో మీడియా ... ఇలా ఒక్కటి కాదు, అనేక శక్తులతో పోరాడేందుకు జగన్లో ఎన్ని గుండెలో? జగన్ అనే ఆ ఒక్కడే కావచ్చు...వెయ్యి గుండెల ధైర్యం లేకపోతే ... దుష్టశక్తులతో పోరాడేందుకు మరొకరి వల్ల సాధ్యం కాదని చెప్పొచ్చు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు