తెలుగుదేశం నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. గత కొన్నాళ్లుగా కేశినేని నాని చంద్రబాబునే లక్ష్యంగా చేసుకున్నట్టుగా అసంతృప్త స్వరాన్ని వినిపించడానికి వెనుకాడటం లేదు.
తన ఫేస్ బుక్ పేజీ నుంచి చంద్రబాబు ఫొటోను తొలగించడంతో మొదలుపెడితే, '23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్న చంద్రబాబు నాయుడు మంచివాడు? ఒక డివిజన్ అభ్యర్థిని చేర్చుకున్న తను చెడ్డవాడినా?' అంటూ.. కేశినేని టీడీపీ క్యాడర్ ఎదురుగానే ప్రశ్నించడం వంటి పరిణామాలు రసవత్తరంగా మారాయి.
అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చంద్రబాబుపై కేశినేని నాని ధోరణి ఏమిటో స్పష్టం అయ్యింది. ఈ క్రమంలో విజయవాడ మేయర్ అభ్యర్థిత్వం గురించి కేశినేని లెక్కలకు చంద్రబాబు నాయుడు చెక్ చెప్పారనే ప్రచారం కూడా ఊపందుకుంది. గుంటూరు మేయర్ అభ్యర్థిత్వ ప్రకటన ద్వారా.. విజయవాడ మేయర్ అభ్యర్థిత్వంపై కేశినేని నాని పెట్టుకున్న ఆశలను అడియాసలు చేశారట చంద్రబాబు నాయుడు.
గుంటూరు మేయర్ అభ్యర్థిగా ఒక కమ్మ వ్యక్తిని ప్రకటించారు. కాబట్టి పక్కనే ఉన్న విజయవాడ మేయర్ అభ్యర్థిగా కమ్మ వాళ్లకు చాన్సు ఇచ్చే అవకాశాలు లేదనే ఇన్ డైరెక్ట్ సందేశం ఉందట ఈ ప్రకటనలో! గుంటూరు మేయర్ అభ్యర్థి కమ్మ వ్యక్తి కాబట్టి, విజయవాడ మేయర్ గా కేశినేని కూతురును ప్రకటించే అవకాశాలు ఉండవని.. సామాజిక న్యాయం లెక్కలో మరొకరికి ఈ ఛాన్స్ దక్కుతుందని చంద్రబాబు నాయుడు ఇన్ డైరెక్టుగా కేశినేనికి క్లారిటీ ఇచ్చేసినట్టే అని చర్చ జరుగుతూ ఉంది.
మేయర్ అభ్యర్థిత్వం తన కూతురుకు దక్కడం లేదనే అసంతృప్తి ఏదైనా ఉంటే.. కేశినేని ఇక టీడీపీ నుంచి మూటాముల్లె సర్దుకోవచ్చని కూడా చంద్రబాబు నాయుడు ఇన్ డైరెక్టుగా తన ఉద్దేశాన్ని చెప్పిసినట్టే అనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లోచంద్రబాబుకు ఎత్తుకు కేశినేని చిత్తవుతున్నట్టేనా లేక ఏవైనా పై ఎత్తులు వేస్తారా? అనే చర్చ కూడా ఊపందుకుంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు