మోడీ సర్కార్ తీసుకొచ్చిన అగ్రికల్చర్ బిల్లులు ఎట్టకేలకు చట్టరూపం దాల్చాయి. ముఖ్యంగా రాజ్యసభలో ప్రతిపక్షాల ప్రతిఘటన, తీవ్ర నిరసనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లులను అధికార పార్టీ ఆమోదం చేయించుకొంది. దీంతో రాజ్యసభలో ప్రజాస్వామ్యానికి ఆదివారం నాటి ఘటన బ్లాక్ డే అని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు రాజ్యసభలో బిల్లులను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. దీంతో తెలంగాణ బీజేపీ తప్పు పట్టింది.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఆయన నేరుగా ఒకే ఒక్క ప్రశ్నసంధించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ బిల్లులు చరిత్రాత్మకమే అయితే... రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని కేటీఆర్ ట్విటర్ వేదికగా నిలదీశారు.
గత వారంలో కొత్త రెవెన్యూ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినప్పుడు రైతులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారని, రాష్ర్ట వ్యాప్తంగా ఊరూరా రైతులంతా సంబురాల్లో మునిగితేలారని కేటీఆర్ గుర్తు చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుల బిల్లులపై అలాంటి స్పందన రాలేదెందుకని ఆయన ప్రశ్నించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేటీఆర్ ప్రశ్నలకు బీజేపీ సమాధానాలు ఇస్తే తెలుసుకోవాలని ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు