Advertisement

Advertisement


Home > Politics - Political News

వికేంద్రీకరణ..థాంక్స్ టు జగన్

వికేంద్రీకరణ..థాంక్స్ టు జగన్

ఒకప్పుడు మూడేసి మండలాలు కలిసి ఓ సమితిగా వుండేవి. ఇప్పుడు ఏవైతే మండల కేంద్రాలుగా వున్నాయో అవన్నీ ఒకప్పుడు ఓ మాదిరి పెద్ద పంచాయతీలు లేదా పెద్ద పల్లెటూళ్లు. ఎన్టీఆర్ మండలాలు ప్రకటించేసరికి ఈ 'పెద్ద పల్లెటూళ్ల'లో కనీస సౌకర్యాలు లేవు. అసలు ప్రభుత్వ కార్యాలయం అనే దానికి అవకాశం చాలా చోట్ల లేదు. ఆరంభంలో నానా గడబిడ. రికార్డులు గల్లంతు. ఈ ఊరు ఆ మండల కేంద్రానికి దూరం...ఆ ఊరు ఈ మండలంలో కలపాలి ఇలాంటి వార్తలు అనేకం. 

కానీ ఇప్పుడు దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత ప్రతి మండల కేంద్రం ఓ పట్టణంగా మారిపోయింది. ప్రభుత్వ ఆఫీసులు, దాని చుట్టూ దుకాణాలు, జనాల రాకపోకలు, ఇలా స్వరూపమే మారిపోయింది. ఆఫ్ కోర్స్ దానికి ఏళ్ల కాలం పట్టింది. అంతే కాదు. నలభై ఏళ్ల క్రితం తహసీల్దార్ అంటే దాదాపు జిల్లా కలెక్టర్ లెవెల్. కానీ ఇప్పుడు ఎవరైనా నేరుగా ఎమ్మార్వోని కలవచ్చు.  కారణం పరిథి తక్కువ కావడం. అంతకు మించి మరేం కాదు.

ఎన్టీఆర్ ఆ రోజు తీసుకున్న ఆ పాలనా వికేంద్రీకరణ నిర్ణయం తరువాత మళ్లీ అలాంటి విప్లవాత్మక నిర్ణయం జగన్ తీసుకున్న జిల్లాల విస్తరణే. దాంతో పాటు గ్రామ సచివాలయాలు. ఇవ్వాళ చాలా అంటే చాలా పనులు మండల కార్యాలయానికి వెళ్లకుండా సచివాలయాల్లోనే జరిగిపోతున్నాయి. అదంతా ఆల్రెడీ ముచ్చటించుకున్న, అమలు లోకి వచ్చిన సంగతులు. 

ఇప్పడు జిల్లాల విస్తరణ టైమ్ లో సన్నాయి నొక్కలు నొక్కేవారు మామూలే. డబ్బులు లేవు. ఆఫీసులు లేవు. ఎందుకు ఈ వ్యవహారం. అంటూ.  నిజమే కావచ్చు..కాకపోవచ్చు. కానీ ఇది చేయాల్సిన పనే. ఎందుకంటే చాలా పెద్ద పట్టణాలు ఓ స్థాయి వరకు అభివృద్ది చెంది అక్కడితో ఆగిపోయాయి. జిల్లా కేంద్రాలు కాకపోవడమే దీనికి కొంత కారణం. ఉదాహరణకు ఓ పెద్ద జిల్లాను మొత్తం కలెక్టర్ లేదా ఎస్పీ పర్యవేక్షించడం వేరు. ఓ చిన్న ప్రాంతాన్ని పర్యవేక్షించడం వేరు. తమ దృష్టిని వీలయినంత ఎక్కువ సారించడానికి ఇప్పుడు సాధ్యం అవుతుంది. 

ఇప్పుడు జిల్లాల విస్తరణ పై అసంతృప్తిగా, విమర్శగా, సన్నాయి నొక్కలు నొక్కుతూ మాట్లాడేవారు ఒక్క పదేళ్లు ఆగితే తెలుస్తుంది. ఆ ప్రాంతాలు అన్నీ ఎలా అభివృద్ధి చెందుతాయో? అంతే కాదు. చిన్న పట్టణాల్లో కిందిస్థాయి పోలీస్ అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీల అదుపాజ్ఞల్లో వుంటారు. అదే ఐపిఎస్ అధికారులు వస్తే ఆ లెవెల్ వేరుగా వుంటుంది. 

అందువల్ల అడ్డగోలు ట్రాఫిక్ వ్యవహారాలకు, గొడవలకు అడ్డుకట్ట పడుతుంది. ఎప్పుడైతే జిల్లాలు చిన్నవై, ఫండ్స్ వస్తాయో, వాటిని ఖర్చు చేసే పరిథి తగ్గుతుంది. అందువల్ల అభివృధ్ది వికేంద్రీకరణ సాధ్యం అవుతుంది. విభజనలో చిన్న చిన్న ఇబ్బందులు లేదా పొరపాట్లు వుంటే వుండొచ్చు. కానీ అంత మాత్రం చేత విభజనే తప్పు అంటే సరి కాదు. 

అంతే కాదు ఏనాటి నుంచో వికేంద్రీకరణ జరగక చాలా పట్టణాలకు అన్యాయం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పలాస కనీసం రెవెన్యూ డివిజన్ కాదు. పక్కనే టెక్కలి రెవెన్యూ డివిజన్ కావడం వల్ల ఈ సమస్య. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆ కొరత తీరింది. అనకాపల్లి  జిల్లా కేంద్రం కావడానికి అన్ని విధాలా అర్హతలు వున్న పట్టణం. కానీ కనీసం ఇన్నాళ్లూ రెవెన్యూ డివిజన్ కూడా కాదు. విశాఖపట్నాన్ని ఆనుకుని వుండడమే సమస్య. ఇప్పుడు ఏకంగా జిల్లా కేంద్రంగా అవతరిస్తోంది.

ఇలాంటి పట్టణాలు ఆంధ్రలో అనేకం వున్నాయి. ఇప్పుడు ఈ పట్టణాలన్నీ మరింత అభివృద్దికి నోచుకోపోతున్నాయి. థాంక్స్ టు జగన్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?