పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం, నిర్వహించకపోవడం అనే వార్ లో ప్రభుత్వం ఓడిపోయింది. ఆ ఓడి పోవడం కూడా ఎలా అంటే, ఎప్పుడూ తన హయాంలో ఎన్నికలు నిర్వహించడానికి వెనుకాడే చంద్రబాబు రంకెలు వేస్తూ హీరో అయిపోయారు.
ధైర్యంగా దేన్నైనా ఎదుర్కుంటారని పేరున్న జగన్ ఢిఫెన్స్ ఆడుతున్నట్లు జనాల్లోకి పోయింది. సరే, అయిపోయిందేదో అయిపోయింది. భవిష్యత్ కార్యాచరణ చూడాలి కదా.
మంత్రులను, పార్టీ జిల్లాల బాధ్యులను, కమిటీలతోనూ జగన్ మాట్లాడాల్సి వుంది. వారిని ఉత్సాహపరచాల్సి వుంది. కేవలం మూడు ఏరియాలు సుబ్బారెడ్డి, సజ్జల, విజయసాయిలకు పంపకం పెట్టేస్తే సరిపోదు.
పార్టీ వ్యవహారాలు ఎలా వున్నాయి అన్నది మండల, జిల్లా కమిటీల ద్వారా జగన్ నేరుగా తెలుసుకోవాల్సి వుంది. మంత్రుల వ్యవహారాలు, ఈ ముగ్గురు త్రిమూర్తుల వ్యవహారాలు ఎలా వున్నాయి అన్నది జగన్ కు తెలియాల్సి వుంది.
జగన్ అధికారంలోకి వచ్చి చాలా కాలం అయింది. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు, కోర్టు వ్యవహారాలతోనే సరిపోయింది. పార్టీని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ కమిటీలు ఎలా పని చేస్తున్నాయి.
కార్యకర్తల మనోభావాలు ఎలా వున్నాయి తదితర విషయాలు గమనించాలి. ఆపై తనకు వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు దిశానిర్దేశం చేయాలి. ప్రతి జిల్లా పార్టీ జనాలతో సమావేశం కావాలి.
పార్టీని ఇలా పట్టించుకోకుండా లోకేష్ కు వదిలేసి తాను అమరావతిని చూసుకుంటూ కూర్చుంటేనే చంద్రబాబు కుర్చీ కిందకు నీళ్లు వచ్చాయి. ఆ పరిస్థితిని జగన్ తెచ్చుకోకూడదు.
కేవలం త్రిమూర్తులకు పార్టీని వదిలేసి తాను ప్రభుత్వాన్ని చూసుకుంటూ వుంటే వికటించే ప్రమాదం వుంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు