హైదరాబాద్ కి వరదలొస్తే ఆఘమేఘాల మీద కోటి రూపాయల ఆర్థికసాయం ప్రకటించి తన పెద్దమనసు చాటుకున్నారు పవన్ కల్యాణ్. అదే విపత్తు ఏపీలో వస్తే మాత్రం రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు సంధిస్తున్నారు.
ఏపీలో 2.71 ఎకరాల్లో పంట నీటమునిగిందని మొసలికన్నీరు కారుస్తున్న పవన్, తక్షణ సాయం అందించడంలో జగన్ సర్కారు విఫలమైందని సుద్దులు చెబుతున్నారు.
గతేడాది పెట్టబడి రాయితీలు ఇవ్వలేదని, ఈ ఏడాది వరద సాయంపై కూడా ప్రభుత్వం ఉదాసీనంగా ఉందంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు పవన్. వరద నష్టం త్వరగా అంచనా వేయండి అని సీఎం జగన్ చెప్పిన నాలుగు రోజుల తర్వాత పవన్ కల్యాణ్ కి ఉత్సాహం వచ్చింది కాబోలు, వెంటనే నెట్టింట్లోకి వచ్చేశారు.
అసలు రైతుల తరపున మాట్లాడే అర్హత పవన్ కి ఉందోలేదో ఓసారి చెక్ చేసుకోవాలి. రుణమాఫీ చేస్తామని రైతులకు ఆశ చూపి అధికారంలోకి వచ్చిన ఆనాటి టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించలేకపోయారు. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోంది.
టీడీపీ హయాంలో జరిగిన పంట నష్టానికి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక నిధులు విడుదల చేసింది, ఇన్ పుట్ సబ్సిడీ బకాయిల్ని కూడా టీడీపీ తరపున వైసీపీ చెల్లించింది. మరి పవన్ కి ఈ సాయమంతా కనపడలేదా. ముంపు బాధితులకు ప్రభుత్వం అందించిన రేషన్ సాయం పవన్ కి కనపడలేదా?
టీడీపీ విమర్శలు, పచ్చమీడియాలో రాతల ఆధారంగా పవన్ కల్యాణ్ మాట్లాడ్డం సరికాదు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం తమకి ఉందని నారా లోకేష్ పర్యటనలోనే రైతులు చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చారు. ఆ మాటలు పవన్ కి వినపడలేదా? రైతు భరోసా పేరుతో కష్టాలు రాకముందే ఆర్థిక సాయం అందిస్తూ, రైతు భరోసా కేంద్రాల్ని రాష్ట్రమంతా ఏర్పాటు చేసి.. అన్నదాతలకు అండగా నిలబడ్డ జగన్ ని విమర్శించే అర్హత పవన్ కి ఉందా?
తెలంగాణకు వరదలొస్తే.. నెపం ప్రకృతి పైకి నెట్టేసి, ఏపీలో వరదలొస్తే.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం పవన్ నైజాన్ని మరోసారి బైటపెట్టింది. రెండు నాల్కల ధోరణిలో చంద్రబాబుని మించిపోయేలా పవన్ వ్యవహరిస్తున్నారని జోకులు పేలుతున్నాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు