Advertisement

Advertisement


Home > Politics - Political News

టీటీడీలో ఇక క్వారంటైన్ డ్యూటీలు

టీటీడీలో ఇక క్వారంటైన్ డ్యూటీలు

అన్ లాక్ తర్వాత తిరుమలలో శ్రీవారి దర్శనాలు తిరిగి మొదలయ్యాయి. ప్రస్తుతం రోజుకి 13 వేల మందికి తక్కువ కాకుండా భక్తులు స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకూ ఒక్క భక్తుడికి కూడా కరోనా నిర్థారణ కాలేదు. కొండ కిందే పక్కాగా పరీక్షలు జరిపి, పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారిని మాత్రమే దర్శనానికి పంపిస్తున్నారు. క్యూలైన్లలో సామాజిక దూరం పాటించడం, అడుగడుగునా శానిటైజర్లు, దర్శనాల తర్వాత ఆలయ ప్రాంగణాన్ని డిజిన్ఫెక్షన్ చేయడం.. వంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది టీటీడీ.

అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 2 రోజుల క్రితం ఏడుగురు సిబ్బంది కరోనా బారినపడ్డారని స్వయంగా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆ తర్వాత అత్యవసరంగా టీటీడీ పాలకమండలి సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సంఖ్య పెంచకూడదని, ఆన్ లైన్లో కల్యాణోత్సవ సేవ జరిపించాలని నిర్ణయించారు. ఇదిలా జరుగుతుండగానే గంటల వ్యవధిలో మరో 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

సిబ్బందికి విధులు పూర్తి చేసుకున్న తర్వాత కొండ కిందకు రావడం, కుటుంబ సభ్యులు, బంధువులతో కలవడం, ఆ తర్వాత మళ్లీ డ్యూటీకి రావడం ఇలా చేస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, ఇతర కాంటాక్ట్స్ వల్ల కరోనా సోకుతోంది. ఇప్పటివరకు నమోదైన 17 కేసులు కూడా ఇలాంటివే. దీంతో టీటీడీ తమ సిబ్బంది విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోవాలనుకుంటోందట.

కొన్నాళ్ల పాటు దేవస్థానంలో డ్యూటీ చేసే సిబ్బంది అంతా పూర్తిగా కొండపైనే క్వారంటైన్లో ఉండిపోయేలా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇందుకు సిద్ధపడి ముందుకొచ్చేవారికే విధులు కేటాయిస్తారట. ఒకసారి అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత వారిని డ్యూటీకి అనుమతిస్తారు. ఆ తర్వాత వారు కొండపైనే ఎవరి గదుల్లో వారు విడివిడిగా ఉండాలి. కుటుంబ సభ్యుల్ని కలవడం, బంధువుల దగ్గరకు వెళ్లడం ఇలాంటివి చేయకూడదు.

అంటే వైద్య సిబ్బంది ఎలా డ్యూటీలకు వచ్చి ఇంటికెళ్లిన తర్వాత ఒంటరిగా ఉంటారో.. టీటీడీ ఉద్యోగులు కూడా అలాగే ఉండాలన్నమాట. అలా అయితేనే తిరుమల దర్శనాలు కొనసాగుతాయని, లేకపోతే అనివార్యంగా మళ్లీ భక్తుల దర్శనాలు నిలిపివేయాల్సి వస్తుందని భావిస్తున్నారు పాలకమండలి సభ్యులు.

వాస్తవానికి రాష్ట్రంతో పాటు, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి కంటైన్మెంట్ జోన్ల వారికి టీటీడీ దర్శనాలు ఆపేసింది. కొండపైకి వచ్చేటప్పుడు పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి మరీ పంపిస్తున్నారు. భక్తుల విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు, సిబ్బంది విషయంలో కూడా పగడ్బందీగా ఉండాలనేది ఉన్నతాధికారుల ఆలోచన. అందుకే ఇకపై టీటీడీ సిబ్బంది క్వారంటైన్ డ్యూటీలకు సిద్ధపడాల్సిందే. కొన్నాళ్ల పాటు కుటుంబ జీవితాన్ని త్యాగం చేయాల్సిందే.

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?