Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్యో అయ్య‌య్యో రోజా...!

అయ్యో అయ్య‌య్యో రోజా...!

చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే, వైసీపీ మ‌హిళా ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజాపై నెటిజ‌న్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన నేత‌లు రోజాపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. త‌మ అధినాయ‌కుడు చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌ను ఇష్టానుసారం మాట్లాడుతున్న రోజాకు సొంత పార్టీ వాళ్లే త‌గిన బుద్ధి చెబుతార‌ని టీడీపీ నేత‌లు జోస్యం చెబుతున్నారు. రోజా రాజ‌కీయం ఆరిపోతున్న దీపంతో పోల్చుతున్నారు.

పార్టీ నుంచి పొమ్మ‌న‌కుండా పొగ పెడుతున్నార‌ని, ఉక్కిరిబిక్కిరి అవుతున్న రోజా తీవ్ర ప్ర‌స్ట్రేష‌న్‌లో నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా న‌గ‌రిలో త‌న వ్య‌తిరేక వ‌ర్గాన్ని సొంత పార్టీలోని మంత్రులు ప్రోత్స‌హిస్తున్నా, ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో రోజా ఉన్నార‌ని అంటున్నారు. రోజా మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతాన‌ని సాగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు.

జ‌గ‌న‌న్న కోసం ఎన్నో అవ‌మానాలు ప‌డ్డానన్నారు. జ‌గ‌న్ కోసం ఎన్నో పోరాటాలు చేశాన‌న్నారు. అసెంబ్లీలో కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్‌పై పోరాటం చేసినందుకు రూల్స్‌కు విరుద్ధంగా ఏడాది పాటు బ‌హిష్క‌రించార‌ని గుర్తు చేశారు. త‌న‌ను సొంత చెల్లెలిగా భావిస్తున్న జ‌గ‌న్‌కి రెండుసార్లు ఎమ్మెల్యే చేసినందుకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఎవ‌రైనా త‌ప్పు చేసిన వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవాలే గానీ, జ‌గ‌న్‌ను అభిమానించే త‌న‌కు ఆ అవ‌స‌రం లేద‌న్నారు. జ‌గ‌న్‌ను చూసి స్ఫూర్తి పొందిన నేత‌న‌ని చెప్పారు. ఆయ‌న ప‌డ్డ క‌ష్టంలో ఎవ‌రు ఎన్ని క‌ష్టాలు పెట్టినా చిన్న దూదితో సమానమ‌న్నారు. దానికి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

జ‌గ‌న్ సొంత చెల్లితో త‌న‌ను తాను పోల్చుకోవ‌డంపై నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. జ‌గ‌న్ కోసం మూడు వేల కిలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేసిన ష‌ర్మిల‌మ్మ‌, అలాగే తండ్రి హ‌త్య‌కు సంబంధించి నిందితులెవ‌రో తేల్చాల‌ని కాళ్ల‌రిగేలా తిరుగుతున్న దివంగ‌త మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి త‌న‌య డాక్ట‌ర్ సునీత‌కు సోద‌రుడైన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న సాయం ఏంటో తెలుసుకుంటే మంచిద‌ని రోజాకు నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు.

భ‌విష్య‌త్‌లో ష‌ర్మిల‌, డాక్ట‌ర్ సునీత దుస్థితే త‌న‌కొస్తుంద‌ని రోజా తెలిసో తెలియ‌కో నిజ‌మే చెప్పార‌ని నెటిజ‌న్లు వెటక‌రిస్తూ కామెంట్స్ పెట్ట‌డం విశేషం. అంటే ష‌ర్మిల తెలంగాణ‌కు వెళ్లిన‌ట్టు ... రోజా కూడా అదే పంథా ప‌డుతుంద‌నే వార్త నిజ‌మే అన్న‌మాట అని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి జ‌గ‌న‌న్న సొంత చెల్లిగా త‌న‌ను తాను అభివ‌ర్ణించుకోవ‌డం ద్వారా సోష‌ల్ మీడియాలో రోజా ట్రోలింగ్‌కు గురి అవుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?