పెళ్లి పేరుతో ఓ యువతి డబ్బున్న వాళ్లకు వల వేసేది. డబ్బు రాబట్టుకున్న తర్వాత , కాంటాక్ట్ను కట్ చేసేది. ఇలా ఆమె మోసానికి గురైన వాళ్ల ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. సదరు యువతి మోసాలను పసిగట్టి, మోసగత్తెను కటకటాలపాలు చేశారు.
సులభంగా డబ్బు సంపాదించేందుకు మ్యాట్రిమోనీ వెబ్సైట్ను మార్గంగా నెల్లూరుకు చెందిన స్వాతి ఎంచుకుంది. ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. స్వాతి భర్త ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. పెద్ద హోదాలో స్థిరపడ్డ తెలుగు అమ్మాయిలా తెలుగు మ్యాట్రిమోనీ వెబ్సైట్లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించేది. అందమైన యువతుల ఫొటోలను జత చేసేది.
అందమైన ఫొటోలకు మనసు పారేసుకున్న వాళ్లను తియ్యటి మాటలతో ముగ్గులోకి దింపేది. అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించేందుకు వర్చువల్ ఫోన్ నెంబర్లతో కాల్ చేసేది. అలా పరిచయం పెంచుకుంటూ, పెళ్లి చేసుకుంటానని తేనెలాంటి మాటలతో బుట్టలో వేసుకునేది. ఒక్కో అవసరాన్ని చెబుతూ వారి నుంచి డబ్బులు రాబట్టేది.
పెళ్లి చేసుకుందాం, ఇండియాకు వస్తున్నా అని వరుడిని నమ్మించేది. వరుడు ఆనందంతో ఎగిరి గంతేసిన క్షణంలో చిన్న మెలిక పెట్టేది. ఆర్థికంగా చిన్న సమస్య వచ్చిందని, కొంత డబ్బు అడ్జెస్ట్ చేయాలని కోరేది. ఆ డబ్బులు అందగానే వరుడితో సంబంధాలను కట్ చేసుకునేది.
ఇలా ఆమె మాయ మాటలు నమ్మి రూ. 5లక్షలు మోసపోయిన ఓ కుటుంబం సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడంతో స్వామి ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో నెల్లూరు నివాసైన స్వాతి నేరాలు బయటపడ్డాయి. పోలీసులు స్వాతిని అరెస్టు చేశారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు