అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు వీలైనంతగా ప్రముఖులను ఆహ్వానించి బలప్రదర్శన చేయాలనేది టీడీపీ ఎత్తుగడ. ఈ క్రమంలో జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ను కూడా ఆహ్వానించాలని మొదట్లో టీడీపీ భావించింది.
అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఇంత కాలం మహాపాదయాత్ర, ఇప్పుడు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నది టీడీపీనే అనేది బహిరంగ రహస్యమే.
తికాయత్ను ఆహ్వానించి, ఆయనతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయించి ఆత్మరక్షణలో పడేయాలనేది టీడీపీ వ్యూహం. అయితే తికాయత్ కేంద్రంలోని మోడీ సర్కార్ను, దేశ వ్యాప్తంగా బీజేపీ విధానాలను తప్పు పడితే అసలుకే మోసం వస్తుందనే భయంతో ఆయన్ను ఆహ్వానించేందుకు వెనక్కి తగ్గినట్టు టీడీపీ వర్గాల సమాచారం.
మోడీ సర్కార్పై తికాయత్ ఆగ్రహంగా ఉన్నారనే సమాచారాన్ని పసిగట్టిన టీడీపీ... ఆయన్ను ఆహ్వానించే విషయమై కసరత్తు చేసింది. ఇటీవల తికాయత్ తెలంగాణకు వెళ్లి, బీజేపీకి బీ టీం టీఆర్ఎస్ అని విమర్శించారు. అలాగే టీఆర్ఎస్, బీజేపీలను కలిపి విమర్శించిన సంగతి తెలిసిందే.
తికాయత్ను ఆహ్వానించిన తర్వాత, సభా వేదికపై ఏం మాట్లాడాలో ఆయనకు చెప్పలేని పరిస్థితి. అందుకే తికాయత్ విషయం లో చివరి వరకూ సందిగ్ధత కొనసాగింది.
తికాయత్ను ఆహ్వానించి, ఆయన బీజేపీపై విమర్శలు చేసి, వాటి వెనుక టీడీపీ ఉందనే నిందని కొని తెచ్చుకోవడం దేనికనే అభిప్రాయాలు పార్టీలో అంతర్గతంగా వెల్లడి కావడంతో వెనక్కి తగ్గినట్టు చర్చ జరుగుతోంది. అందుకే రాకేశ్ తికాయత్ పాద స్పర్శకు ఇవాళ్టి అమరావతి అలియాస్ టీడీపీ బహిరంగ సభ నోచుకోలేదని చెప్పొచ్చు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు