ఏపీ బీజేపీ నేతల అత్యుత్సాహం ... చివరికి బూమ్రాంగ్ అయింది. అతి ఎప్పటికీ మంచిది కాదని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఏపీలో రాత్రికి రాత్రే రాజకీయంగా బలపడేందుకు తిరుమల డిక్లరేషన్ అనే ఆయుధం దొరికందని ఏపీ బీజేపీ నేతలు బలంగా నమ్మారు. దీంతో తన మిత్ర పక్షం జనసేనతో కలిసి తిరుమల డిక్లరేషన్పై దూకుడుగా వ్యవహరించింది.
ఇందులో భాగంగా తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి సతీసమేతంగా వెళ్లాలని బీజేపీ నేతలు గట్టిగా డిమాండ్ చేశారు. దాన్ని ఏదో ఒక్క మాటతో సరిపెడితే పోయేది. కానీ డిక్లరేషన్ ఇవ్వాలని, జగన్ సతీసమేతంగా వెళ్లాలని, లేకుంటే రాష్ట్రానికి అరిష్టమని .... ఇలా అనేక వాదనలను బీజేపీ తెరపైకి తెచ్చింది. జగన్ను మతం ప్రాతిపదికన ఇరుకున పెట్టాలని భావించిన టీడీపీ, జనసేన కూడా అదే రాగాన్ని అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని తిరుమలలో మీడియా మాట్లాడుతూ బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి దీటుగా సమాధానం ఇచ్చే క్రమంలో ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యలను ఆయన లాగారు. మంత్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే...
‘ఆయోధ్యలో రామాలయం భూమిపూజ జరిగిన ప్రదేశానికి ప్రధాని మోడీగారు మరోసారి సతీసమేతంగా వెళ్లి కనిపించిన తర్వాత.. శివపార్వతులు, వేంకటేశ్వరస్వామి పద్మావతిలా మోదీ ఎలా చేస్తున్నారో అలాగే చేసి ఈ దేశానికి ఆదర్శంగా నిలవమని బీజేపీ చెబితే బాగుంటుంది. మోదీ ఏ భార్యను తీసుకెళ్లారు. యూపీ సీఎం యోగి ఏ భార్యను తీసుకెళ్లారు. ఎందుకీ పిచ్చమాటలు’ అంటూ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నాయకుల మాటల వల్ల మోడీ గారి భార్య గురించి, శంకుస్థాపన గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పు కొచ్చారు. అలాగే ఎవరి పార్టీ వ్యవహారాలు వారు చూసుకుంటే మంచిదని, గత ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మెరుగైన ఓట్లు సాధించేందుకు ప్రయత్నించాలని నాని హితవు చెప్పారు. కొడాలి నాని తాజాగా తెరపైకి తీసుకొచ్చిన అంశాలు జనాల్లోకి నేరుగా వెళ్లాయి. ‘ఔను కదా, నాని అడుగుతున్నది నిజమే కదా’ అనే అభిప్రాయాలు సామాన్య జనం నుంచి వినవస్తున్న మాటలు.
కానీ అందరి గురించి ప్రశ్నించే, నిలదీసే హక్కు తమకే ఉందని, తమను ఎవరూ ఏమీ అనకూడదనే అహంకార ధోరణిలో ఉన్న బీజేపీకి నాని విమర్శలు రుచించడం లేదు. దీంతో మంత్రిని బర్తరఫ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్పై రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా, వ్యక్తిగత విషయాలకు వెళ్లడంతో ...అటు వైపు నుంచి బుల్లెట్ లాంటి మాటలు దూసుకు రావడంతో బీజేపీ గిలగిలా తన్నుకుంటోంది. మొత్తానికి ఏపీ బీజేపీ నేతల అతి ... చివరికి ప్రధాని మోడీని బజారుకీడ్చేలా చేసింది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు