పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ , ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. పరిపాలనా పరమైన అంశాల్లో గవర్నర్ తన పరిధి మించి జోక్యం చేసుకుంటుండంతో ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
గవర్నర్, ముఖ్యమంత్రి పరస్పరం ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. అందులోనూ పశ్చిమబెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ... ఆ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ను ముందు పెట్టి బీజేపీ ఓ ఆట ఆడుతున్నదనే విమర్శలున్నాయి.
తాజాగా గవర్నర్కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 9 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో గవర్నర్కు ఘాటుగా హితవు పలి కారు. రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తించొద్దని గవర్నర్ను మమతా హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన అధికార పరిధులను అతిక్రమించి పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని గవర్నర్ జగదీప్ ధన్కర్కు సీఎం లేఖ రాశారు.
ఇటీవల ఆ రాష్ట్ర డీజీపీకి గవర్నర్ లేఖ రాయడంతో పాటు తనను కలవాలని ఆదేశించడంపై మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడు తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని డీజేపీకి గవర్నర్ లేఖ రాయడాన్ని ఆమె తప్పు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తో పాటు పోలీసులపై నిరాధార, దురుద్దేశంగా నిందారోపణలు మోపేలా గవర్నర్ లేఖ ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రికి రాజ్యాంగం కల్పించిన హక్కులేంటో మమతాబెనర్జీ ప్రస్తావించడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలి సూచనలు, సలహాల మేరకే గవర్నర్ నిర్ణయాలు తీసుకోవాలని రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని మమతా బెనర్జీ గుర్తు చేశారు. అయితే రాష్ట్ర గవర్నర్ వాటన్నటినీ ఖాతరు చేయకుండా వ్యవహరిస్తుండడం విచారకమన్నారు.
రాజ్యాంగ ప్రతినిధిగా గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి సీఎం అని ఆమె హితవు పలికారు. మమతా లేఖపై గవర్నర్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ ఆ రాష్ట్రంలో నెలకొంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు