విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపడం, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతాపార్టీపై వ్యతిరేకతకు దారి తీసింది. అసలే ఏపీలో అంతంత మాత్రమే ఉన్న బీజేపీకి, ఉక్కు ప్రైవేటీకరణ పర్యవసానాలు మరింత నష్టాన్ని కలిగించాయి.
తాజాగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెల్లడైన నేపథ్యంలో, తిరుపతి ఉప ఎన్నికకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో పోటీ చేసేందుకు బీజేపీ ముందు చూపినంత ఆసక్తి ... ఇప్పుడు చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రుల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్న కేంద్రంలోని బీజేపీపై రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. ఈ వాస్తవాన్ని పసిగట్టిన రాష్ట్ర బీజేపీ నేతలు, తిరుపతి సీటును మిత్రపక్షమైన జనసేనకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిసింది.
మరోవైపు ఇటీవల ఐదు బలిజ సంఘాలు చంద్రగిరిలో సమావేశమై, తిరుపతి ఎంపీ సీటును జనసేనకు కేటాయించాలని, ఒకవేళ ఇవ్వకపోతే తమ సామాజిక వర్గీయులంతా నోటాకు ఓటు వేస్తామని హెచ్చరించారు.
తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కంటే, మిత్రపక్షమైన జనసేనకే కేటాయించి, గౌరవాన్ని కాపాడుకోవడం మంచిదనే అభిప్రాయంలో బీజేపీ నేతలు ఉన్నారని తెలిసింది.
ఇదే జనసేనకు కేటాయిస్తే, ఆ పార్టీకి మద్దతుగా నిలిచే బలిజల ఓట్లు వస్తాయని, కనీసం పరువైనా నిలుస్తుందనే చర్చ జరుగుతోంది. తమకు సీటు ఇచ్చే విషయమై బీజేపీలో మార్చు వచ్చిందని జనసేన నాయకులు కూడా చెబుతున్నారు. దీనంతటికి విశాఖ ఉక్కు ఎఫెక్ట్ కారణంగా జనసేన నేతలు చెబుతున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు