ప్రధాని పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ను పాటిస్తున్నారు. ఈ నెల 14వ తేదీకి లాన్డౌన్ కాలం పూర్తి అవుతుంది. ఆ తర్వాత లాక్డౌన్ ఉంటుందా? ఉండదా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో వైపు రోజురోజుకూ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేయడం లేదా సడలించడం అనేది సరైన నిర్ణయం అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,289 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 505 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో నమోదైన, ప్రాణాలు కోల్పోయిన వాళ్ల సంఖ్య తక్కువే. అయితే ఇది ఇలాగే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే అగ్రదేశమైన అమెరికా ఇలాంటి నిర్లక్ష్య ధోరణితోనే ప్రాణాల మీదికి తెచ్చుకొంది. ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో చెప్పలేమని సాక్ష్యాత్తు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ నిస్సహాయత ప్రకటించడం గమనార్హం.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి స్తే ఏపీలో 252, తెలంగాణలో 333 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఏపీలో 60, తెలంగాణలో 62 కేసులు నమోదయ్యాయి. అందులోనూ కర్నూలులో ఒక్కరోజే 49 కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులన్నీ ఢిల్లీ జమాతేకు వెళ్లి వచ్చినవే కావడం గమనార్హం.
జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ తదితర కట్టుదిట్ట మైన చర్యల ద్వారా చాలా వరకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్ట కలిగాం. మూడు వారాల పాటు లాక్డౌన్తో ఇబ్బందులకు భయపడితే....రానున్న విపత్తు సంగతి ఏంటి? ఒక వైపు చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల మృత్యు ఘోష వింటూ కూడా ...లాక్డౌన్ను సడలించడం భావ్యమా అని ప్రశ్నించే వాళ్లు లేకపోలేదు. ఇన్ని రోజులు ఎంతో కష్టపడి అదుపు చేసిందంతా....లాక్డౌన్ ఎత్తివేతతో ప్రజల శ్రమ, త్యాగం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం జగన్ ఆదివారం కరోనాపై సమీక్ష నేపథ్యంలో లాక్డౌన్పై సీరియస్గా చర్చించారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఏపీలో కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. అంతేకాకుండా అత్యధిక కేసులు నమోదైన రెడ్జోన్ ప్రాంతాల్లో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెల 14న తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని బట్టి లాక్డౌన్ కొనసాగింపుపై అధికారికంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆలోచన, ఆదేశాలను పరిశీలిస్తే లాక్డౌన్ కొనసాగింపునకే ఆయన మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు