దారుణం.. హైదరాబాద్ లో హైకోర్టు ముందే మర్డర్

పట్టపగలు హత్యలు జరగడం హైదరాబాద్ లో కొత్త కాదు. గతంలో అత్తాపూర్ లో, ఈమధ్య మియాపూర్ లో నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా హైకోర్టు ముందే అందరూ చూస్తుండగా ఓ హత్య…

పట్టపగలు హత్యలు జరగడం హైదరాబాద్ లో కొత్త కాదు. గతంలో అత్తాపూర్ లో, ఈమధ్య మియాపూర్ లో నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా హైకోర్టు ముందే అందరూ చూస్తుండగా ఓ హత్య జరిగింది. ఓ వ్యక్తిని అందరిముందు కత్తితో దారుణంగా పొడిచి పరారయ్యాడు అగంతకుడు.

హైకోర్టు గేట్ నంబర్ 6 ముందు ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. చూస్తున్న జనం చిన్న గొడవే అనుకున్నారు. అంతలోనే ఓ వ్యక్తి కత్తి తీశాడు. ఎదుటి వ్యక్తిని కసితీరా పొడిచాడు, దారుణంగా హత్య చేశాడు. అది చూసిన జనం ఉలిక్కి పడ్డారు. కత్తిపోటుకు గురైన వ్యక్తి స్పాట్ లో ప్రాణాలు కోల్పోయాడు. హంతకుడు పారిపోయాడు.

జరిగిన ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కేవలం రూ. 10వేల కోసం..

చనిపోయిన వ్యక్తిని మిథున్ గా గుర్తించారు. అతడు సమీపంలో ఉన్న ఓ సులభ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్నాడు. హంతకుడికి, ఇతడికి కొన్ని నెలలుగా పరిచయం ఉంది. ఇద్దరి మధ్య 10వేల రూపాయల కోసం గొడవ జరిగింది. ఆ గొడవలో విచక్షణ కోల్పోయిన హంతకుడు, మిథున్ ను కత్తితో పొడిచి చంపేశాడు.

హత్య అనంతరం ఆ స్థలం నుంచి పరారైన హంతకుడు, ఆ తర్వాత కొద్దిసేపటికి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హంతకుడు లొంగిపోయిన విషయాన్ని నిర్థారించారు.