తెలంగాణ రాష్ట్రాన్ని పేపర్ లీకులు వెంటాడుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం వరకూ టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీకు కావడం తెలంగాణను తీవ్రంగా కుదుపునకు గురి చేశాయి. ప్రస్తుతం ఆ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. తాజాగా పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకు కావడం కలకలం రేపుతోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
టెన్త్ పరీక్షలు మొదలైన మొదటి రోజే తెలుగు క్వశ్చన్ పేపర్ లీక్ కావడం ఆందోళన కలిగించింది. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొందరు పనిగట్టుకుని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు ప్రశ్న పత్రం లీకైన షాక్ నుంచి తేరుకోకుండానే, మరొక పిడుగులాంటి వార్త.
టెన్త్ ఎగ్జామ్స్ రెండో రోజు వరంగల్లో హిందీ ప్రశ్నపత్నం వాట్సప్ గ్రూప్స్లో చక్కర్లు కొట్టడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా పేపర్లు లీక్ అవుతుండడంతో ప్రభుత్వం షాక్కు గురైంది. హిందీ పరీక్ష మొదలవగానే బయటికొచ్చినట్టు సమాచారం. అయితే పరీక్ష జరిగిన గంటన్నర సేపటి తర్వాత బయటికి వచ్చినట్టు వరంగల్ సీపీ రంగనాథ్ అనడం గమనార్హం.
ఈ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంపై విచారణ చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. వాట్సాప్లో ప్రశ్నాపత్రం లోకేషన్ అధారంగా ఛేదిస్తామని ఆయన అన్నారు. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఏ సెంటర్ నుంచి పేపర్ లీక్ అయిందో తేలుతుందని సీపీ రంగనాథ్ చెప్పారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ చెప్పారు.