ఆ పది మందికి అవమానం.. ఆగ్రహమా? వ్యూహమా?

మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించిన పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూడండి అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలా జరిగిందన్నది ఇప్పుడు అప్రస్తుతం. సభలో అధినేత కేసీఆర్ గంటసేపు ప్రధానోపన్యాసం చేశారు. అసలు సభలో మాట్లాడింది ఆయన ఒక్కడే కదా. ఆయన ప్రసంగం ఎలా సాగిందన్నది కూడా ఇప్పుడు అనవసరం. ఆయన రేవంత్రెడ్డిని చీల్చిచెండాడా? వెన్నులో వణుకు పుట్టించాడా? ఠారెత్తించాడా? ఇది కూడా చర్చనీయాంశం కాదు.

అయితే కేసీఆర్ కావొచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావొచ్చు తాము శత్రువులుగా చూసే నాయకులను ఎక్కడ ఉన్నా వదిలిపెట్టరని అర్థమవుతోంది. బ్రహ్మాండంగా భారీ ఎత్తున రజతోత్సవ బహిరంగ సభ జరుగుతున్నప్పుడు కూడా తమ శత్రువులైన పది మంది ఫిరాయింపు దారులను వదిలిపెట్టలేదు. ఈ సభ సందర్భంగా ఆ పది మంది ఫిరాయింపు దారులను ఘోరంగా, దారుణంగా అవమానించారు. ఇలా అవమానించాలన్న ఆలోచన నాయకులకు వచ్చిందో, కార్యకర్తలకు వచ్చిందో తెలియదు.

వారిని అవమానించాలని నాయకులు వ్యూహం పన్నారో, కార్యకర్తలే ఆగ్రహించారో తెలియదు. ఫిరాయింపు దారులు ఈ సభకు వస్తే వారిని అవమానించారని అనుకుంటున్నారా? కాదు. అసలు వాళ్లు సభకు ఎందుకు వస్తారు? సభ నిర్వహించిన ప్రదేశంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసులోకి వెళ్లిపోయిన పదిమంది ఎమ్మెల్యేల ఫొటోలతో ఓ ఫ్లెక్సీ తయారు చేయించి పెట్టారు. ఆ ఫ్లెక్సీని చూసిన కార్యకర్తలు ఆగ్రహంతో చెప్పులు, కర్రలతో దాన్ని విపరీతంగా కొట్టారు. దానిపైకి బాటిల్లు విసిరేశారు. ‘ద్రోహులు’ అంటూ వారిని దుర్భాషలాడారు.

మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించిన పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూడండి అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పదిమంది ఫిరాయింపు దారుల్లో కొందరికి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోవాలని ఉంది. వీరు వీలు దొరికిప్పుడల్లా ప్రభుత్వంపై వ్యతిరేకతను కనబరుస్తున్నారు. నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తాము కాంగ్రెసు పార్టీలో చేరలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నామని బహిరంగంగానే చెప్పారు.

తాము కేసీఆర్ భక్తులమని అన్నారు. కాంగ్రెసు పార్టీలోకి ఫిరాయించినా ఆ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు గాని, ప్రభుత్వ కార్యక్రమాలకు గాని హాజరుకావడం లేదు. నిజానికి కాంగ్రెసు పార్టీలోనూ వీరికి గుర్తింపు లేదు. ప్రాధాన్యం లేదు. అనర్హత వేటు భయం వీరిని వెంటాడుతోంది. తమ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని భయపడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు మీదనే వీరి భవిష్యత్తు ఆధారపడి వుంది

4 Replies to “ఆ పది మందికి అవమానం.. ఆగ్రహమా? వ్యూహమా?”

  1. అవునా అప్పట్లో సిద్దం సభలలో మన జగ్గడు చంద్రబాబు , పవన్ ల పంచింగ్ బ్యాగ్లు పెట్టి కార్యకర్తలని రెచ్చగొట్టినప్పుడు, ఏమైనాయిరా ఈ నీతులు

  2. 2014 లో టీడీపీ కాంగ్రెస్ నుంచి చేర్చుకున్న ఎంఎల్ఏ లు ద్రోహులు కాదా, వీళ్ళు మాత్రమే ద్రోహులా 

  3. కేసిఆర్ పాలనలో టిడిపి, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు స్వాతంత్ర్య సమర యోధులా..

    కాంగ్రెస్ పాలనలో బిఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు దేశద్రోహులా..

Comments are closed.