ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అమరావతి పాదయాత్రలో రైతులు ఎక్కడున్నారని ఆయన నిలదీశారు. ఇవాళ ఆయన శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. పండగ వస్తే ఉత్తరాంధ్ర వాసులు వలసల నుంచి తిరిగి వస్తున్నా రన్నారు. ఎన్నాళ్లీ ఈ దుర్గతి, దౌర్భాగ్యం అని ఆయన నిలదీశారు. ఈ అవస్థలు ఇంకెన్నాళ్లని తమ్మినేని ప్రశ్నించారు.
అది రైతుల పాదయాత్ర ఎంత మాత్రం కాదన్నారు. బినామీల యాత్రగా అభివర్ణించారు. ఈ విషయాన్ని తాము మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. ముసుగు వీరులెవరో అసెంబ్లీలోనే చెప్పి నట్టు స్పీకర్ తెలిపారు. రాజధాని కోసం 28 వేల మంది రైతుల వద్ద భూములు లాక్కుంటే పాదయాత్రకు ఎంత మంది వచ్చారో అందరూ చూశారని ఆయన చెప్పుకొచ్చారు. ఐడెంటిటీ కార్డు చూపమంటే కళ్యాణ మండపం నుంచి ఎవరూ బయటకు రాలేదన్నారు. చంద్రబాబు హిడెన్ ఎజెండాతో ఇదంతా నడిపిస్తున్నారని విమర్శించారు.
ప్రపంచ రాజధాని అంటున్న చంద్రబాబుకు విశాఖ ఎందుకు గుర్తు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఒకటికి వెయ్యి రెట్లు భూముల రేట్లు పెంచాలనే కుట్రతో ఇన్సైడర్ ట్రేడ్ చేసి అమరావతిలో రాజధాని పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరికీ, అన్ని వర్గాలకు రాజధాని అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు.
కేవలం ఒక సామాజిక వర్గానికి మేలు చేసేందుకే సెంటర్లీ లొకేటెడ్ అంటున్నారని మండిపడ్డారు. అమరావతి కట్టకుండా గ్రాఫిక్స్ మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా పాదయాత్ర చేసుకోవాలని హైకోర్టు అనుమతి ఇస్తే, తొడలు కొట్టడం, రెచ్చగొట్టడం లాంటి చర్యలకు దిగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నాయకుడంటే ఒక సామాజిక వర్గం కోసం కాదు, సమాజం కోసం పాటు పని చేయాలన్నారు.
చంద్రబాబు మెకానిజం ఎవరిని మభ్యపెట్టడానికో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం చంద్రబాబు తన సామాజిక వర్గం ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజధాని పెట్టారని అధికార పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మక దాడి చేస్తోంది. ఈ కోణంలోనే సీతారామ్ విమర్శలను కూడా చూడాల్సి వుంటుంది. కేవలం తన సామాజిక వర్గం ప్రయోజనాల కోసం చంద్రబాబు పాలన సాగించారని స్పీకర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉత్తరాంధ్రలో రాజధానిపై స్పృహ కలిగించడంలో అధికార పార్టీ నేతలు కొంత వరకూ సక్సెస్ అయ్యారు.