సలార్-2 మరింత ఆలస్యం కానుందా..?

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది సలార్ సినిమా. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీని ఓ ఊపు ఊపుతోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన సలార్, టాప్ ట్రెండింగ్ లో…

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది సలార్ సినిమా. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీని ఓ ఊపు ఊపుతోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన సలార్, టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, సలార్ సక్సెస్ తో జోష్ మీదున్న ప్రశాంత్ నీల్, వీలైనంత త్వరగా పార్ట్-2ను కూడా తీయాలని నిర్ణయించుకున్నట్టు ఈమధ్య వార్తలొచ్చాయి. దీని కోసం ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను ఇంకాస్త ఆలస్యం చేస్తున్నాడనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

అయితే ప్రాక్టికల్ గా చూస్తే, సలార్-2 సెట్స్ పైకి రావడం కాస్త కష్టమే. ఎందుకంటే, కీలకమైన మరో నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ అందుబాటులో లేడు కాబట్టి.

అవును.. సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ ను పూర్తిచేసిన పృధ్వీరాజ్ సుకుమారన్, లూసిఫర్-2 ప్రాజెక్టుపైకి చేరాడు. మోహన్ లాల్ హీరోగా తన దర్శకత్వంలో లూసిఫర్-2 ను కొన్నాళ్ల కిందట ప్రకటించాడు పృధ్వీరాజ్. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు.

మార్చి నుంచి లూసిఫర్-2కు కాల్షీట్లు కేటాయించారు మోహన్ లాల్. అంతేకాదు, తొలి షెడ్యూలే విదేశాల్లో ప్లాన్ చేశారు. సో.. ఆ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లబోతున్నాడు పృధ్వీరాజ్. అతడు మళ్లీ అందుబాటులోకి వచ్చేంతవరకు సలార్-2 స్టార్ట్ అవ్వకపోవచ్చు.

ఎందుకంటే, సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వంకు పృధ్వీరాజ్ ఎంత అవసరం అనే విషయం పార్ట్-1 చూసినోళ్లకు ఎవరికైనా అర్థమౌతుంది. ఈ గ్యాప్ లో రాజాసాబ్, కల్కి సినిమాల్ని పూర్తిచేస్తాడు ప్రభాస్.