రిటైర్డ్ వెటరన్‌లని చేరదీసి ఏం చేయాలని?

ఏపీసీసీ సారథిగా నియమితురాలైన తరువాత.. వైఎస్ షర్మిల తొలిసారిగా కడప జిల్లాల్లో అడుగుపెట్టారు. ఆదివారం నాడు పీసీసీ సారథ్య బాధ్యతలను స్వీకరించే ముందు ఆమె తండ్రి ఆశీస్సులు తీసుకోవడానికి ఇడుపులపాయలోని ఆమె సమాధిని సందర్శించారు.…

ఏపీసీసీ సారథిగా నియమితురాలైన తరువాత.. వైఎస్ షర్మిల తొలిసారిగా కడప జిల్లాల్లో అడుగుపెట్టారు. ఆదివారం నాడు పీసీసీ సారథ్య బాధ్యతలను స్వీకరించే ముందు ఆమె తండ్రి ఆశీస్సులు తీసుకోవడానికి ఇడుపులపాయలోని ఆమె సమాధిని సందర్శించారు. వైఎస్సార్ ఆశయాలను సాధించడం కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా, వైఎస్ కోరిక మేరకు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి తన వంతు పాటుపడనున్నట్టుగా షర్మిల ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.

ఆమె ఎక్కు పెట్టిన విమర్శలు కూడా కేంద్రంలోని బిజెపి సర్కారును టార్గెట్ చేస్తున్నట్టుగానే ఎక్కువగా ధ్వనిస్తున్నాయి. సెక్యులరిజం, రాజ్యాంగం గురించి మాట్లాడడం అంటే.. బిజెపిని తప్పుబట్టడమే లెక్క అనుకోవాలి. రాష్ట్ర రాజకీయాల మీద తక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా ఆమె ప్రస్తుతానికి మాటలను ధ్వనింపజేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు.. అనేదే ఇక్కడ కీలకం. నిజంగా ఆ పార్టీ శవాసనం వేసిన ఏపీలో తిరిగి బతికి బట్టకట్టాలంటే.. యువ ఓటర్లను ఆకర్షించాలి. యువ నాయకులను తమ జట్టులో చేర్చుకోగలగాలి. రొటీన్ కాంగ్రెస్ సాంప్రదాయ నాయకుల శైలిలో ఢిల్లీకి ఊడిగం చేస్తూ ఉంటాం.. మీరు మాకు మద్దతు నిలవండి అని షర్మిల అడిగితే.. అందుకు ఒప్పుకోవడానికి ఏపీలోని యువతరం సిద్ధంగా ఉన్నదా అనేది పెద్ద ప్రశ్న.

అదే సమయంలో.. కాంగ్రెస్ నుంచి ఏనాడో  బయటకు వెళ్లిన, అసలు పూర్తిగా రాజకీయ ఆలోచనలనే  మానుకున్న వృద్ధ, రిటైర్డ్ వెటరన్ నాయకులు అందరూ ఇప్పుడు మళ్లీ పార్టీలోకి వస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ప్రాపకంతో రాజకీయ జీవితం ప్రారంభించిన, మంత్రి హోదాను కూడా అనుభవించిన అహ్మదుల్లా.. తిరిగి కాంగ్రెసులో చేరారు. షర్మిల కడప జిల్లా పర్యటనలో కాంగ్రెసు సీనియర్లు రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, శైలజానాధ్, తదితరులు ఉన్నారు.

ఈ సంకేతాలను గమనిస్తోంటే.. ముందు ముందు కూడా.. ఇలా పూర్తిగా విరామజీవితం గడుపుతున్న నాయకులే పెద్ద సంఖ్యలో షర్మిల జట్టులోకి వచ్చేలాగా కనిపిస్తోంది. ఇలాంటి వెటరన్ లో ఆమె పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారనే వాదన వినిపిస్తోంది. అయితే షర్మిల మాటలను జాగ్రత్తగా గమనిస్తే.. ఎంపీ ఎన్నికల మీద తప్ప ఎమ్మెల్యే ఎన్నికల మీద ధ్యాస ఉన్నట్టు అనిపించడం లేదు. బహుశా ఆమె తన పార్టీలో చేరే ఇతర నాయకుల్ని కూడా ఎంపీ ఎన్నిక మీద శ్రద్ధపెట్టమని అడగవచ్చు. అయినా, ఆ దిశగానైనా ఆమె ఈ శిథిలపార్టీకి సారథిగా ఏమైనా సాధించగలరా? లేదా? అనేది వేచిచూడాలి.