ఫోకస్ అంతా జగన్.. నమ్ముతారా?

వైఎస్సార్ కుమార్తె ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక అధికార వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. ఏపీలో పదేళ్ళుగా ఉన్న సమస్యలు తిరగతోడి వాటి పాపాన్ని జగన్ నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా…

వైఎస్సార్ కుమార్తె ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక అధికార వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. ఏపీలో పదేళ్ళుగా ఉన్న సమస్యలు తిరగతోడి వాటి పాపాన్ని జగన్ నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని అంటున్నారు. ఆ హోదా పాపం వెనక ఎవరు ఉన్నారు అన్నది షర్మిలకు తెలియదా అన్నది వైసీపీ నేతల నుంచి వస్తున్న ప్రశ్నలు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నేతలు చెప్పారు. ఆ తరువాత దానిని ప్యాకేజి కిందకు చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. ఏపీకి హోదా తీసుకురావాల్సిన పార్టీలు పొత్తులో ఉన్న పార్టీలు అయిన టీడీపీ- బీజేపీలను వదిలేసి వైసీపీ మీద షర్మిల విమర్శలు చేయడాన్ని అంతా చూస్తున్నారు. వైసీపీ నేతలు అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే చేస్తున్న విమర్శలుగా అంటున్నారు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చంద్రబాబు టైం లోనే బీజేపీ చెప్పేసింది. 2019 తరువాత అది ఎక్కడా అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ బుర్ర బిగుసుకుని కూర్చుంది. అయినా ఆ పార్టీతో పొత్తులో అధికారికంగా జనసేన ఉంది. ఒకనాడు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజి అన్నది పాచిపోయిన లడ్లు అంటూ విమర్శించిన పవన్ బీజేపీ మైత్రీ బంధంలో ఉన్నారు.

బీజేపీతో పొత్తుకు మళ్లీ టీడీపీ ప్రయత్నం చేస్తోంది. అలాంటిది వైసీపీనే అన్నింటికీ తప్పు అన్నట్లుగా షర్మిల మాట్లాడడం మీద వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఒక్కటే కాదు రైల్వే జోన్ విషయం కూడా పదేళ్ళుగా కాదు పాతికేళ్ళుగా ఉన్న సమస్య. పోలవరం అన్నది కూడా పదేళ్ళ పాటు కేంద్రంలో ఉన్న యూపీయే ఎందుకు ముందుకు తెచ్చి జాతీయ ప్రాజెక్ట్ గా నిర్మించలేదు అన్న దానికి జవాబు లేదు.

వెనకబడిన జిల్లాలకు ఆర్ధిక సాయం కింద ఇచ్చే నిధులు కూడా చంద్రబాబు సీఎంగా ఉండగానే పోయాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రం తమ ఆధీనంలోని సంస్థ అని నిర్ణయం తీసుకుంది. ఇలా అన్నీ వారసత్వంగా వచ్చిన సమస్యలు పాత సమస్యలు ఉంటే అన్నింటికీ జగన్ దే తప్పు అన్నట్లుగా షర్మిల మాట్లాడడం పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏదో విధంగా వైసీపీకి బీజేపీకి ముడిపెట్టి మైనారిటీ ఓట్లకు కళ్ళెం పెట్టడం ఆ విధంగా ఏపీలో వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగించాలని చూడడమే షర్మిల అజెండా అని అంటున్నారు. ఏపీలో వైసీపీ నష్టపోతే వచ్చేది కాంగ్రెస్ కాదు ఆ సంగతి అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్న దాని మీదనే ఆమె వైసీపీని జగన్ ని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు.

షర్మిల గత నాలుగు రోజులుగా చేస్తున్న ప్రసంగాలు అన్నీ కూడా చూస్తే చంద్రబాబు ప్రస్తావన కానీ టీడీపీ చేసిన నిర్వాకాల మీద కానీ విమర్శలు అయితే లేవు అంటున్నారు. ఎంతసేపూ జగన్ మీదనే విమర్శలు చేయడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో ఉనికి లేని పార్టీకి నాయకురాలిగా షర్మిల వచ్చారని, ఆమె అంటే గౌరవం ఉందని కానీ ఇలా అనవసర ఆరోపణలు చేయడమేంటి అన్నది మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా అందరిలో కలుగుతున్న ప్రశ్న. టీడీపీ చంద్రబాబుని వదిలేసి జగన్ మీదనే విమర్శలు చేస్తూ పోతే జనాలు కూడా అర్ధం చేసుకుంటారని అంటున్నారు.